ఢీల్లీ, జనవరి2: రఫేల్ యుద్ధవిమానాల స్కామ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షిచాల్సిందిగా కోరుతూ బుధవారం రివ్యూ పిటిషన్ దాఖలయింది. రఫేల్ విమానాల కొనుగోళ్ల ఒప్పందంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కోరుతూ మాజీ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్ధానం గతేడాది డిసెంబర్ 14న తీర్పు వెల్లడించింది. దర్యాప్తు జరపాల్సిన అవసరం తమకు కనబడడం లేదంటూ పిటిషన్లను తోసిపుచ్చింది.
యుద్ధవిమానాల ఒప్పందంలో బిజెపి ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రఫేల్ ఒప్పందంపై కేంద్రం తప్పుడు వివరాలు న్యాయస్థానానికి సమర్పించిందని రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై బహిరంగ న్యాయస్ధానంలో విచారణ జరపాలని అరుణ్శౌరీ, యశ్వంత్ సిన్హా తదితరులు కోర్టును కొరారు.