గెలిస్తే పార్లమెంటులో పెత్తనం రాదు. ఓడితే పరువు పోదు..!
గెలిస్తే అసెంబ్లీలో అధికారం రాదు. ఓడితే నష్టం కాదు..! కానీ బీజేపీ గెలవాలి. కచ్చితంగా గెలవాలి అనుకుంటుంది. ఉనికి కోసం గెలవాలి. ఊపు కొనసాగడం కోసం గెలవాలి. సుదీర్ఘ లక్ష్యం కోసం గెలవాలి. 2024 కుర్చీ కోసం గెలవాలి. అదే బీజేపీ గురి..! టీఆరెస్ ని తెలంగాణలో ఓడించడం అసాధ్యం కాదు. కాకపోతే ఒక కట్టుదిట్టమైన వ్యూహం ఉంటే చాలు..! కేసీఆర్ ని మాటలతో కొట్టాలి. కేటీఆర్ ని మానసికంగా కొట్టాలి. పార్టీ ఎమ్మెల్యేలను ఆర్ధికంగా కొట్టాలి. కార్యకర్తలను ప్రలోభాలతో కొట్టాలి. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కొత్త పంథా ఎంచుకుంది. అధికార పార్టీని భయపెడుతుంది. కేసీఆర్ కి కంగారు పుట్టింస్తుంది. బీజేపీ అమలు చేస్తున్న ఎన్నికల స్ట్రాటజీ చూస్తే పెద్ద పెద్ద కాకలు తిరిగిన రాజకీయ యోధులకు కూడా ఆశ్చర్యం వస్తుంది..!!
ఆరెస్సెస్ X నిఘా విభాగం..!!
అధికార పార్టీ అంటే నిఘా విభాగం దాసోహంగా పని చేస్తుంది. అందుకే గ్రేటర్ లో కూడా టీఆరెస్ కి ఆ స్టేట్ ఇంటెలిజెన్స్ అండగా ఉంది. రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ విభాగ పెద్దలు అందరూ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు. మరి నిఘా విభగానికి తలదన్నే విధంగా బీజేపీ కూడా ఒక టీమ్ ని పెట్టుకుంది. బీజేపీకి మూలమైన, అనుబంధంగా, బలమైన ఆరెస్సెస్ అండగా ఉంది. అధికార పార్టీకి నిఘా విభాగం ఎలాగో.. బీజేపీకి ఆరెస్సెస్ అలా పని చేస్తుంది.
* ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టి.. ప్రతిపక్ష నాయకుల కదలికలను పసిగట్టి.. అడుగడుగునా అడ్డుకోవడమే నిఘా విభాగం పని. అవసరమైతే పోలీసుల ద్వారా అరెస్టులు కూడా చేయిస్తారు. అధికార పార్టీకి సమాచారం ఇస్తారు. ఏదోటి చేసి ప్రతిపక్ష పార్టీల ఆటలు సాగనీయరు. పంపకాలు జరగనీయరు. ప్రలోభాలు చేసుకోనివ్వరు. తెలంగాణాలో ప్రస్తుతం నిఘా విభాగం అధికారులు, సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. కానీ..!
* ఇక్కడ బీజేపీ తమకు సొంతంగా ఒక నిఘా వ్యవస్థని తయారు చేసుకుంది. రాష్ట్రం మొత్తం నుండి ఆరెస్సెస్ బలగాన్ని హైదరాబాద్ లో దించేసింది. రహస్యంగా కొన్ని డివిజన్లకు పంపించేసింది. ఆ డివిజన్లలో కీలక అధికార పార్టీ నేతలపై నిఘా పెట్టింది. వారి నుండి సమాచారం ఇస్తూ… వారిని కదలనీయట్లేదు, పంచనీయట్లేదు, ప్రలోచాలు ఇచ్చుకోనీయట్లేదు. అంటే అక్కడ అధికార పార్టీకి అనుగుణంగా నిఘా టీమ్ చేయాల్సిన పనిని మరింత వేగంగా, మరింత చురుకుగా ఆరెస్సెస్ చేస్తుంది. కొన్ని డివిజన్లలో ఇప్పటికే టీఆరెస్ నేతలు పంపిణీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, టీఆరెస్సో పంపిణీలపై షల్ మీడియాలో బదనాం చేసారు. బీజేపీ కార్యకర్తలు.., టీఆరెస్ కార్యకర్తలు ఇవు ఎన్నికల పనుల్లో ఉండగా.. బీజేపీ దించిన ఆరెస్సెస్ మాత్రం ఎన్నికల కోసమే ఎన్నికేతర పనుల్లో బిజీగా ఉంటుంది..
రేపు ఏదో జరగబోతుంది..!!
ఇక మరో కీలక విషయం. హైదరాబాద్ లో ఏది జరగబోతుంది. రేపు ఎన్నికల సందర్భంగా కొన్ని డివిజన్లలో కచ్చితంగా కొట్లాట జరుగుతుంది అనేది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అందరూ అనుకునేలా పాతబస్తీలో కాదు సుమీ. ఎవరూ ఊహించని కొన్ని డివిజన్లలో, కొన్ని బూతుల్లో ఒక ప్లాన్ ప్రకారం ఘర్షణలు జరగనున్నాయనేది నిఘా వర్గాలకు అందిన సమాచారం. అందుకే పోలీసులు, నిఘా వర్గాలు కూడా చురుగ్గానే ఉన్నారు. కాకపోతే బీజేపీని మరీ ఎక్కువగా అడ్డుకున్నా.., ఆపినా అప్పటికప్పుడు సానుభూతి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆపితే ఒక బాధ, ఆపకపోతే మరో ఇబ్బంది. అందుకే బీజేపీ ప్లాన్ ఏమిటో పూర్తిగా తెలుసుకోలేక టీఆరెస్ డిఫెన్స్ లో పడిందంటూ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తానికి గ్రేటర్ వేదికగా బీజేపీ ఒక కొత్త తరహా రాజకీయానికి, పోల్ మేనేజ్మెంట్ కి తెరతీసింది. ఎన్నికలు అంటే ఎన్ని ప్రచారాలు ఉన్నా, ఎన్ని ప్రలోభాలు ఉన్నా… పోల్ మేనేజ్మెంట్ చేసినదాని బట్టి ఫలితాలు ఉంటాయి. అదే ఇప్పుడు బీజేపీ తమ బలంగా చూపించడానికి సిద్ధమవుతోంది. రానున్న 24 గంటలూ మాత్రం హైదరాబాద్ లో కీలకమే..!