నమ్మకం కల్పించాకే.. ఎక్కడైనా మోసాలు జరిగేది.. ఎవర్నైనా మోసం చేయగలిగేది. సహారా గ్రూపు సంస్థలు చేసింది ఇదే. సహారా అధినేత సుబ్రతారాయ్.. ప్రజలు, ప్రభుత్వానికి నమ్మకం కలిగిస్తూ వ్యాపారం చేశారు. చైన్ సిస్టం ఏర్పాటు చేసి దేశంలోని ప్రజల నుంచి ఏకంగా 25వేల కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న సెబీ.. నిబంధనలు పాటించడం లేదని మేల్కొంది. సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 25వేల కోట్లను సెబీ సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాలని సుబ్రతారాయ్ ను ఆదేశించింది. చేయలేదు. ఇప్పుడు నవంబర్ 18కి వడ్డీతో కలిపి 62,600 కోట్లు కట్టాల్సిందనేని మరోసారి తీర్పు వచ్చింది. దీని వల్ల లాభం ఎవరికి.. నష్టం ఎవరికి?
సెబీ.. మొదలే మేల్కొని ఉంటే..
కొన్నేళ్ల క్రితం దేశంలోని 13 భాషల్లో దాదాపు 42 ప్రధాన పత్రికల్లో సహారా ప్రకటనలు ఇచ్చింది. డిపాజిట్లు, ఉద్యోగాలు అంటూ ప్రచురించింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో వసూళ్లు జరిగాయి. సహారా.. అంటే ఓ నమ్మకం అన్నట్టు ప్రజలు డబ్బులు కట్టారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు.? ప్రజలకు జరిగిన నష్టం పూడ్చేది ఎవరు? 25వేల కోట్లే కట్టలేక నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన సుబ్రతారాయ్.. 62వేల కోట్లు ఎక్కడినుంచి తెచ్చేది? కట్టని పక్షంలో అరెస్టు చేయాలని సెబీ కోరింది. సుబ్రతారాయ్ మళ్లీ అరెస్టయితే.. మహ అయితే ఆయన జైల్లో ఉంటాడు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏముంది?
డిపాజిటర్లకు న్యాయం చేసేది ఎవరు?
మొత్తం సహారా వ్యవహారంలో బ్యాంకుల్లో కట్టుకోకుండా తమ కష్టార్జితాన్ని ఇలా ప్రైవేటుపరం చేసిన ప్రజలను తప్పుబట్టాలా.. లేక వసూళ్లు జరుగుతున్నా పట్టించుకోని సెబీ, ప్రభుత్వాలను అనాలా? మీ ఆదేశాలను కూడా పాటించడం లేదని ఇప్పుడు మళ్లీ కోర్టు తలపు తట్టిన సెబీ.. సుబ్రతాను ఏం చేయగలదు? అరెస్టు తప్ప. ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం ఇప్పుడు నిషేధించి.. కొత్త చట్టాలు తీసుకొచ్చినా ప్రయోజనం లేదు. సుబ్రతారాయ్ వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి ప్రజలకు అందిస్తేనే సరైన న్యాయం.. సుబ్రతారాయ్ ను అరెస్టు చేయిస్తే కాదు..!