మన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి మన్సాస్ ట్రస్టుని సింహాచల ఆలయ దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య వైరం కాస్త విజయనగరం రాజుల కుటుంబాల మధ్య వైరంగా మారింది. ఇటు సంచయిత గజపతిరాజు దూకుడుగా ఉంటూ చంద్రబాబు, లోకేశ్, అశోక్ గజపతిరాజుపై వాగ్భాణాలు వేస్తున్నారు. టీడీపీ నుంచి కూడా స్పందన గట్టిగానే ఉంటోంది. అశోక్ గజపతిరాజు మరోసారి మీడియా ముందుకు వచ్చి తన అన్న కూతురు సంచయిత గజపతి తీసుకుంటున్న నిర్ణయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ ప్రైవేటు ఆస్తి చేస్తారా..?
‘సంచయిత ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ వివాదాలు వస్తున్నాయి. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు సుదూరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాను. ట్రస్టుకు 120 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, వేల ఎకరాలు ఉన్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు ఉండాలి. మహారాజా కళాశాలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చెప్పాలి. మాన్సాస్ ట్రస్ట్.. కుటుంబ, ప్రైవేట్ ఆస్తి కాదు. సంచయిత చైర్ పర్సన్ గా తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదు..
ప్రస్తుత ప్రభుత్వానికి చట్టాలు, రాజ్యాంగంపై గౌరవం లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. మన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో కీలక మార్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రస్టు వ్యవహారంలో తీసుకునే నిర్ణయాలపై లాభనష్టాలను వివరించాల్సిన బాధ్యత సంచయిత గజపతిరాజుపై ఉందన్నారు. సంచయిత బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. సంచయిత వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. చంద్రబాబుకు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై సంచయిత ఎలా స్పందిస్తారో చూడాలి.