గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కోడెల శివప్రసాద్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు టిడిపి అధినేత చంద్రబాబును కలిసేందుకు సిద్ధపడుతున్నారు. కోడెల నాయకత్వంలో తాము పని చేయలేమని స్పష్టం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల ముందు నుండే నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకవర్గ నేతలు కోడెలకు అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దంటూ నిరసనలు, ధర్నాలు చేశారు. సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పార్టీ అధినేత ఆయనకే టికెట్ ఇవ్వడంతో ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో అప్పటి వరకూ సైలెంట్గా ఉన్న ఆయన కుమారుడు, కుమార్తె బాధితులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల కుటుంబంపై 18కేసులు నమోదు అయ్యాయి.
తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కోడెలను ఇంకా నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని, కావున కోడెలను తప్పించాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోడెల నాయకత్వం అవసరం లేదంటూ సత్తెనపల్లి నియోజకవర్గంలో పాత టిడిపి కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించారు. నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.నూతన నాయకత్వం వస్తేనే రానున్న మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి, సొసైటి ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని వారు పేర్కొంటున్నారు. సుమారు 200మందికిపైగా వాహనాలలో బయలుదేరి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్నకోడెల మాజీ మున్సిపల్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు తదితరులకు ఫోన్లు చేసి అసమ్మతి నాయకులతో వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. తటస్థంగా ఉన్న నేతలకు ఇరువర్గాలు ఫోన్లు చేస్తుండటంతో టిడిపిలో అసమ్మతి రాజకీయం వేడెక్కింది.
కోడెల కుటుంబ సభ్యులు కే ట్యాక్స్ పేరుతో సొంత పార్టీ నేతనే ఇబ్బందులు పెట్టిన వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా, స్పీకర్గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నేత కోడెల శివప్రసాద్కు ప్రత్యర్థి పార్టీ వైసిపి నుండే కాక సొంత పార్టీ నేతల నుండీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.