Sattenapalli: ఒక స్థిర నాయకత్వం లేదు.. ఒక ఏకాభిప్రాయం లేదు.. ఒక బలమైన నాయకుడు లేడు.. కానీ అంబటి రాంబాబుని ఓడించాలని టీడీపీ తహతహలాడుతోంది.. సత్తెనపల్లిపై స్పెషల్ ఫోకస్ పెట్టేసింది.. కమ్మ, రెడ్డి ఓటర్లు సమంగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ నెట్టుకురావడం కష్టమే.. కానీ అంబటి రాంబాబు చేసుకున్న కొన్ని స్వీయ తప్పిదాల మూలంగా టీడీపీకి అవకాశం ఇచ్చారు. టీడీపీ ఇప్పుడు ఆ అందుకునే పనిలో నానా అవస్థలు పడుతుంది..!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రస్తుతం నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో అంబటి ఒక బ్రాండ్. పార్టీ ఆవిర్భావం నుండి అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన వాగ్దాటితో ప్రత్యర్ధులను తీవ్రంగా విమర్శించే వారు. ప్రత్యర్ధుల విమర్శలకు ధీటుగా కౌంటర్ లు ఇచ్చేవారు. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితులైయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి కార్యకర్తల బలం ఉన్నప్పటికీ సరైన ఇన్చార్జి లేకపోవడం అంబటికి ప్లస్ పాయింట్ గా ఉంది. కానీ అధికార పార్టీలో వివాదాలు, విబేధాలు అంబటికి తలనొప్పులుగా ఉన్నాయి..
Sattenapalli: టీడీపీలో ముగ్గురు తీవ్ర పోటీ..!?
ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ చార్జి పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్. మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు. ఈ ముగ్గురు నియోజకవర్గంలో బలమైన నాయకులే. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వీరిలో ఎవరికి వారు తమకు సీటు ఇస్తే గెలుస్తాం, ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వండి అని టీడీపీ అధినేత చంద్రబాబును తరచూ కోరుతున్నారు. అయితే కోడెల శివరామ్ పై గతంలో అనేక ఆరోపణలు రావడం, ఆయన సొంత పార్టీ వాళ్ళ నుండే లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉండడంతో ఆయన నాయకత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈయనను పక్కన బెడితే రాయపాటి రంగారావు, వైవీ ఆంజనేయుల మధ్య పోటీ నెలకొని ఉంది. ఓ పక్క రాయపాటి సాంబశివరావు తనకు వయసు అయిపోయింది.., ఇక పోటీ చేయను తమ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకుంటా అని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి రాయపాటి సాంబశివరావు కుటుంబం రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కాలం ఉన్నారు. ఇక వైవీ ఆంజనేయులు తాను ఇంతకు ముందే ఎమ్మెల్యేగా పని చేశాను, నియోజకవర్గంలో పట్టు ఉంది. మరో సారి అవకాశం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్ చార్జి పదవి వీరిద్దరి మధ్య దోబూచులాడుతోంది.
వైసీపీలో విబేధాలు.. అంబటి తలనొప్పులు..!!
నిజానికి సత్తెనపల్లి భిన్నమైన నియోజకవర్గం. కమ్మ, రెడ్డి సామాజికవర్గ ఓట్లు సమంగా ఉన్నప్పటికీ.. విజేతని నిర్ణయించేది మాత్రం కాపు సామాజికవర్గ ఓట్లే. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అంబటి రాంబాబుపై కొంత వ్యతిరేకత కనబడుతోంది. దాదాపు కాపు సామాజిక వర్గ ఓటర్లు 25 వేలకుపైగా ఉంటాయి. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం నేత కావడంతో సొంత సామాజికవర్గం మద్దతుతో పాటు వైసీపీ గాలి, రెడ్డి సామాజిక వర్గం సపోర్టుతో 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ఆయనకు సపోర్టుగా ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతలు ఆయనపై ఇప్పుడు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఆధీనంలో ఉన్న సున్నపురాయి గనులపై అంబటి తలదూరుస్తున్నారని రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆయనకు వ్యతిరేకంగా మారారని అంటున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఆడియో లీకేజీ ఆరోపణలతో ఆయన నియోజకవర్గంలో బలహీనపడ్డారనే ప్రచారం ఉంది.. సత్తెనపల్లి నియోజకవర్గంలో దాదాపు 45 గ్రామాలు ఉండగా 25 గ్రామాల్లో వైసీపీ బలంగా ఉంటే మిగిలిన 20 గ్రామాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మొదటి సారి 1999లో వైవీ ఆంజనేయులు, 2014లో కోడెల శివప్రసాద్ లు గెలిచారు. గతంలో పరిస్థితులను బేరీజు వేసుకుంటే టీడీపీ కొంత మేర బలం పుంజుకొందని అంటున్నారు. కానీ జగన్ బలం, అంబటిపై వ్యతిరేకత పోగొట్టుకుంటే వైసీపీకి ఇది ఈజీ సీటు..!