అంబటి రాంబాబు..వైసిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతలలో ఒకరు. వైసిపి ఆవిర్భావం నుండి పార్టీలో చురుకైన నాయకుడుగా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆప్తుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి పార్టీ అధికార ప్రతినిధిగా నిత్యం మీడియా ముందుకు వస్తూ తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇతర టిడిపి నాయకులపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, కౌంటర్ లు ఇస్తూ ఉంటారు. వైసిపి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ ఉంటారు. ప్రతిపక్షాల విమర్శలను వెంటనే తిప్పికొడుతూ ఉంటారు. ఇప్పటి వరకూ అంబటిపై ప్రతిపక్షాల నుండి కూడా ఎటువంటి ఆరోపణలు రాలేదు. కానీ తాజాగా నియోజకవర్గంలోని సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయనపై ఫిర్యాదులు చేయడం తీవ్ర సంచలనంగా, చర్చనీయాంశంగా మారింది. అంబటి అక్రమాలను బయటపెడుతూ ఆ పార్టీకి చెందిన వాళ్లే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. కేసు విచారణ నేపథ్యంలో అంబటికి చిక్కులు తప్పేలా లేవు.
ఇంతకూ అంబటిపై ఆరోపణలు ఏమిటంటే…
రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడు గ్రామాల్లో అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ప్రధాన ఆరోపణ. దీనిపై రాజుపాలెం వైసిపి కార్యకర్తలు జిల్లా కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారడ్డి, సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖలు పంపిణీ స్పందన రాలేదంట. దీంతో వారు న్యాయవాది ఎఁ నాగ రఘు ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసిపి కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేస్తే ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్న న్యాయవాది… అక్రమ మైనింగ్ పై వైసిపి కార్యకర్తల ఫిర్యాదు మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణ జరిపించాలని ఆదేశించినా అధికారులు చర్యలు చేపట్టలేదని న్యాయమూర్తికి వివరించారు.
అక్రమమైనింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలి
కోట నెమలపురి, కొండమోడు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ల తరపున న్యాయవాది నాగ రఘు కోరారు. దీనిపై అక్రమ మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసును వచ్చె నెలకు వాయిదా వేసింది. అక్రమ వ్యవహారాలకు అధికార పార్టీ నేతలు పాల్పడినా సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గతంలోనే పేర్కొన్నారు. అధికారులు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలోనే ప్రజా ప్రతినిధుల మాటలు వినాలని, ఇతరత్రా అక్రమ వ్యాపార లావాదేవీల విషయంలో తల దూరిస్తే సహించవద్దని కూడా అధికారులకు సిఎం జగన్ ఆదేశించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలను అంబటి ఏ విధంగా తిప్పికొడతారు. సిఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆశక్తికరంగా మారింది.