ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని సూచించింది. ప్రాధమిక హక్కులను మమత సర్కార్ దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీం పేర్కొంది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్వహించాలని భావించారు. వీరు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణాలతో యాత్రకు దీదీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
దీనిపై కలకత్తా హైకోర్టును బిజెపి ఆశ్రయించింది. పిటీషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ యాత్రలకు అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్కి మమత సర్కార్ అప్పీల్ చేసింది. యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించడంతో బిజెపి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థిస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?