(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీకి బ్రేక్ పడింది. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ప్రజానీకం పెద్ద ఎత్తున నష్టపోయారు. వరదల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల వంతున ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే ఈ సాయం కోసం పెద్ద ఎత్తున బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నిన్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నది. నగరంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున వరద సాయం పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత వరద సాయం పంపిణీ కార్యక్రమాన్ని యాధివిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా నిలుపుదల చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది.
వరదల కారణంగా నష్టబోయిన బాధితుల కోసం కేసిఆర్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసింది. దాదాపు 500 కోట్లు పైచిలుకు నగదును ఇప్పటికే పంపిణీ కూడా చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో వరద బాధితులకు సాయం పంపిణీ చేపట్టారు. మరో వైపు వరద సాయం కోసం బాధితులు పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరడంతో అక్కడక్కడా తొక్కిసలాటలు, తోపులాటలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే వరద సాయం పంపిణీపై ఎస్ఈసీకి పలు రాజకీయ పార్టీల నుండి అనేక ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల నేపథ్యంలో వరద సాయం పంపిణీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.