(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఎన్నికల వాయిదా విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రావని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఎన్నికలు వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనీ, తక్షణం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలూ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఫిర్యాదు నేపథ్యంలో గవర్నర్ సోమవారం ఎన్నికల కమిషనర్ను పిలిపించి మాట్లాడారు. ఎన్నికల ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరించారు. గవర్నర్తో భేటీ అనంతరం జరిగిన పరిణామాలపై కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడిస్తారని అందరూ బావించారు. అయితే ఆయన దీనిపై మీడియాతో ఏమి మాట్లాడలేదు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ జారీ చేసిన అదేశాలను ఉపసంహరించుకోవాలనీ, ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాసిన లేఖపై కమిషనర్ రమేష్ కుమార్ స్పందిస్తూ మంగళవారం ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో లేఖలో సవివరంగా వెల్లడించారు.
గతంలో రాజ్భవన్లో ఆర్థిక వ్యవహారాలు చూశాననీ, అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేసిన అనుభవమూ ఉందని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలు నిలిపివేసినా కేంద్ర నిదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారనీ, గోవాలోనూ స్థానిక ఎన్నికల వాయిదాపై చర్చిస్తున్నారని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో తనకు అవగాహన ఉందనీ, 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో సంప్రదింపులు జరిపామనీ, వారి సూచనలు, హామీతో ఎన్నికల వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు వియదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామనీ, అందరికంటే ముందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు వచ్చాయన్నారు.
కరోనా వైరస్ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని డబ్ల్యుహెచ్ఒ తెలిపిందనీ, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోందని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే ఆరు వారాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల వాయిదాను సమర్ధించుకుంటూ కమిషనర్ రమేష్ కుమార్ సిఎస్కు లేఖ రాయడంతో ముఖ్యమంత్రి, ప్రభుత్వ విజ్ఞాపనను ఆయన తిరస్కరించినట్లు స్పష్టం అవుతోంది. మరో పక్క ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాధి ప్రభావం నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా కేసుల విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నదనేది ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?