ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్న ఈ ఎంపీ పార్టీకి బీపీ పెంచేస్తున్నారు.
అయితే, ఆయనపై గత కొద్దికాలంగా ఆ పార్టీ నేతలు ఆయనపై స్పందించడం మానేశారు. అయితే, తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి, వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన రఘురామ కృష్ణంరాజు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. పగలు విగ్గు.. రాత్రి పెగ్గు…అన్నది ఆయన వైఖరి అంటూ మండిపడ్డారు.
బాబుపై సంచలన వ్యాఖ్యలు
అమరావతి అంటే చంద్రబాబు సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారని ఎంపీ సురేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతిలో పేదలు, దళితులు, బీసీలు, మైనార్టీలు మోసపోయి ఐదు సంవత్సరాలు నిండాయని పేర్కొన్నారు. “అమరావతి రైతులకు ఈ ఖర్మ పట్టడానికి చంద్రబాబే కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారం, దందాలకు భూములు కాజేశారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ధర్నాలు, దీక్షలు అందరూ చూశారు. ఒక వైపు అమరావవతి జేఏసీ అని టీడీపీ నాయకులు.. మరొపక్కన రాజధాని ప్రాంతంల్లో మేము కూడా ఉండాలి, మాకు కూడా ఇళ్ల ప్లాటులు కావాలి, మూడు రాజధానులైతేనే పేదవారు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుందని మరికొందరు దీక్షలు చేశారు. పేదవారందరూ ఆర్టిస్టులుగా, మేకప్ మెన్లుగా కొందరికి కనిపించారు. పేదవారిని ఆర్టిస్టులని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆర్టిస్ట్ లను, సినిమా యాక్టర్ లను పెట్టింది ఎవరో అందరికి తెలుసు, సిని నిర్మాతలకు, యాక్టర్ లకు చంద్రబాబు ఎంత కట్టపెట్టారో అందరికి తెలుసు“ అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతే…
త్వరలో టీడీపీ హోదా గల్లంతు కానుందని ఎంపీ కీలక ప్రకటన చేశారు. “ టీడీపీకి ఇప్పుడున్న 23లో ఆరుగురో, ఏడుగురో జారుకున్నారు. ప్రతిపక్ష హోదా కూడా పోయింది.. టీడీపీ బతికే పరిస్థితి లేదు కాబట్టి ఆస్తులు కాపాడుకునే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది.“ అంటూ సంచలన కామెంట్లు చేశారు.