భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమయంలో ఊహించని రీతిలో రాజకీయ విమర్శలు సైతం తెరమీదకు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతల మధ్య విమర్శలు సాగుతున్నాయి.
కేటీఆర్ ఏమన్నారంటే…
హైదరాబాద్ వరదలపై మంత్రి కేటీఆర్ రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వం తప్పు ఎంతుందో..ప్రజల తప్పు అంతే ఉందన్నారు. హైదరాబాద్ పట్టణ చరిత్రలోనే తొలిసారి 1908సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా..అక్టోబర్ నెలలో అత్యధిక వర్ష పాతం నమోదైందని చెప్పారు. రాబోయే మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజల్ని అలర్ట్ చేసేందుకు ప్రభుత్వం 80 సీనియర్ అధికారుల్ని నియమించినట్లు కేటీఆర్ అన్నారు. వరదల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేటీఆర్..ఇప్పటి వరకు 37వేల కిట్లు, నిత్యావసర సరుకులతో పాటు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రూ.45కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.670 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వరదల నుంచి రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ కేంద్రానికి రిపోర్ట్ పంపించినట్లు కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇంకా స్పందించలేదని కేటీఆర్ అననారు.
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. వరదల నుంచి ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. మాటలు కోటలు దాటుతున్నాయ్.. పనులు మాత్రం ప్రగతిభవన్ కూడా దాటడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయ విమర్శలు మానాలని సూచించారు. వరద నష్టంపై ప్రభుత్వం నివేదిక పంపాక కేంద్రం కచ్చితంగా సాయం చేస్తుందని చెప్పారు. త్వరలోనే కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటిస్తాయని తెలిపారు.
కేసీఆర్ దేవుడితో సమానం
మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలు.. వరదల వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిపోయిందని అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకుల పాపమే హైదరాబాద్ లో ఈ పరిస్థితి కి కారణమని ఆయన పేర్కొన్నారు. వర్షాల బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై రాష్ట్ర మంత్రులు స్పందించగా మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించారు. ఏ కష్టమొచ్చినా ప్రజలను ఆదుకునేందుకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడని మంత్రి తలసాని పొగడ్తల వర్షం కురిపించారు. వర్షాలకు నష్టపోయిన వారంతా ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు వాడుకోవాలని మంత్రి తలసాని సూచించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. వానల నుంచి ప్రజలను కాపాడే వరకు టీఆర్ఎస్ నాయకులు ఎవరూ నిద్రపోకుండా పనిచేస్తున్నారని చెప్పారు.