విశాఖపట్టణంలోని గీతం విద్యా సంస్థల కేంద్రం జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏపీలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే, దీనిపై టీడీపీ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. వైసీపీ సైతం అదే రీతిలో కౌంటర్ ఇస్తోంది. విశాఖపట్నంలో రెవిన్యూ పరంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గీతం విద్యా సంస్థలకు ఎటువంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి అక్రమంగా కూల్చడం అనేది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ నిర్మాణాలు పేరిట అడ్డగోలుగా అర్ధరాత్రి కూల్చడం చూస్తుంటే అధికారులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని విరుచుకుపడింది.
కబ్జా విలువ 800 కోట్లు
అయితే, దీనికి అధికార వైసీపీ సైతం అదే రీతిలో స్పందించింది. విశాఖపట్నంలోని వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అమర్, అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడారు. గాంధీ పేరు పెట్టి భూ కబ్జాలు చేయడమా అంటూ ప్రశ్నించారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ మండిపడ్డారు. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చెసుకుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని అమరనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుమారు రూ. 800 కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఐదు నెలల కిందటే అసలు కథ
భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు ఎందుకు రాద్దాతం చేస్తున్నారని అమరనాథ్ ప్రశ్నించారు. “40 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం కాలేజీ ఆక్రమణలో ఉందని ఐదు నెలల క్రితమే అధికారులు గీతం యాజమాన్యానికి తెలియజేశారు. ఆక్రమించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అధికారులు ఎప్పుడో గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో ఎటువంటి కేసు లేదు.. తెలుగుదేశం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కుటుంబ విషయం అని చెప్పి తానే స్వయంగా కేబినెట్ నుండి బయటకు వెళ్లిన విషయం గుర్తు చేస్తున్నాం. “ అని పేర్కొన్నారు.
151 కోట్లు మెక్కేశారు
ఒక ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని అమరానాథ్ ప్రశ్నించారు. “ఆక్రమించిన భూమికి నోటీసులు ఇవ్వాలా..వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా? వైఎస్సార్సీపీ కక్ష సాధింపు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కార్మికుల సొమ్ము 151 కోట్ల రూపాయలు మెక్కేసిన అచ్చెన్నాయుడుకి టీడీపీ అధ్యక్ష పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.. అలానే అవినీతి పరులకు పొలిట్ బ్యూరో లో పదవులు కట్టబెట్టారు“ అని అమరనాథ్ వ్యాఖ్యానించారు.