హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం షర్మిల భర్త అనిల్ కుమార్తో కలసి కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును అందజేశారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెట్టడం చాలా బాధ కలిగించిందని ఆమె తెలిపారు. ఈ పోస్టుల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు.
తెలుగు సినిమా హీరో ప్రభాస్తో తనకు ఎటువంటి సంబంధంలేదనీ, తన జీవితంలో ప్రభాస్ను ఎప్పుడూ కలవలేదనీ, కనీసం ఆయనతో మాట్లాడలేదనీ తన పిల్లలపైన ఒట్టు వేసి చెబుతున్నాననీ ఆమె పేర్కొన్నారు. ఆరోపణకు ఆధారాలు ఉంటే చూపించగలరా అని పోస్టులు పెట్టిన వారిని ఉద్దేశించి ఆమె అన్నారు.
ఇటువంటి పోస్టులు తన ఒక్కరికే జరిగిన అవమానంగా భావించడంలేదని అమె చెప్పారు, మహిళల పట్ల చులకన భావనతో రాస్తున్న రాతలను, తప్పుడు ప్రచారాలను సమాజం ఆమోదించవచ్చా అని ఆమె ప్రశ్నించారు. స్త్రీలపైన జరుగుతున్న దుష్ప్రచారాలను అడ్డుకోవడానికి ప్రజాస్వామ్య వాదులు, జర్నలిస్టులు, మహిళలు మద్దతు పలకాలని ఆమె కోరారు.
ఎన్నికలు వస్తున్న తరుణంలో కావాలని మళ్ళీ అసభ్యకరమైన పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె తెలిపారు.
టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఖండించలేదని ఆమె ప్రశ్నించారు.
మహిళలకు ఆత్మగౌరం ఉందో లేదో చెప్పాలని ఆమె కోరారు. రాజకీయాలను ఇంతగా దిగజార్చవద్దని ఆమె అన్నారు.
షర్మిలతోపాటుగా పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
2014లో ఎన్నికల సమయంలో షర్మిళపైన పలు అభ్యంతరకరమైన పోస్టులను ఫేస్బుక్లో పెట్టడంపై ఆమె గతంలోకూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
previous post
next post