జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తున్న టిడిపి నేత మాజీ ఎంపీ సబ్బం హరికి విశాఖ మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ మేయర్గా , ఎంపీగా పదవులు పొందిన హరి గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు.2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.ఆయన అవకాశం దొరికినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. టీవీ చానళ్లలో జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడమే పనిగా ఆయన పెట్టుకున్నారు .దీంతో సిఎం జగన్ తన సహజ ధోరణిలో సబ్బంహరిని టార్గెట్ చేశారని టాక్. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదు కదా! ఎక్కడ సబ్బంహరి దొరుకుతాడా అని చూసిన మున్సిపల్ అధికారులు మంచి పాయింటే పట్టేశారు.
విశాఖలోని సబ్బం హరికి చెందిన ఇంటికి ఆనుకొని ఉన్న గదిని అక్రమ కట్టడమని జీవీఎంసీ మున్సిపల్ అధికారులు తేల్చేసి వెనువెంటనే కూల్చేశారు. దీనిపై హరి ఆగ్రహోదగ్రుడయ్యారు. తనది అక్రమ కట్టడం అయితే అందుకు సంబంధించిన పత్రాలు చూపిస్తే తానే దాన్ని కూల్చేస్తానని చెప్పినా మున్సిపల్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. అసలు తెలవారు ఝామన నాలుగు గంటల సమయంలో కూల్చి వేతలేమిటని ప్రశ్నించారు.తాను నిద్రలేచే సరికే మున్సిపల్ అధికారులు ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు.నోటీసు ఇవ్వడం గానీ తన వివరణ తీసుకోవడం కానీ చేయకుండా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని దీనిపై న్యాయపోరాటం చేస్తానని హరి తెలిపారు.
అదేసమయంలో సబ్బం హరితోపాటు విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద్ కి పెందుర్తిలో ఉన్న నివాసగ్రుహా౦ ప్రహరి గోడ ఆక్రమణ పేరుతో కూల్చివేతకు కూడా సిద్ధమయ్యారు. ఆయన ఇంటి ప్రహరీ గోడలో కూడా కూల్చి వేయాల్సిన భాగానికి మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేసి వెళ్ళారు. విశాఖను రాజధానిగా చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న జగన్ ప్రభుత్వం అక్కడ ఏ ఒక్క టిడిపి నాయకుడు కూడా నోరెత్తకుండా చేయడానికి వేస్తున్న రకరకాల ఎత్తుగడలలో భాగమే ఈ చర్యలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు!మరి జగనా!మజాకా!!