ఏపీ రాజకీయాల్లో సహజంగానే… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య పోలిక తెరమీదకు వస్తుంటుంది.
రాజకీయం చేయడానికి, ప్రజల మనసులు గెలుచుకునేందుకు అనుభవమే అవసరం లేదు అంటూ విశ్లేషకులు చెప్తుంటారు. కొన్ని ఉదంతాల్లో అది నిజమే అనిపిస్తుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన విషయంలో. ఇంతకీ ఇది దేని గురించి అంటే, ప్రస్తుత వరదల బీభత్సం గురించి. ప్రభుత్వం స్పందించిన విధానం గురించి.
బాబు టీం ఏం అంటోంది?
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరదనీటి నిర్వహణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని , టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రజా రాజధాని అమరావతిని, ప్రతిపక్ష నేత ఇంటిని ముంచడం కోసం ఆడిన దుర్మార్గపు నాటకాల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంకగ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు నానా అగచాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని వరద ముంచెత్తుతుందని తెలిసినప్పుడు, ఎవరెవరితో ఏమేం చర్చించారు… అధికారులతో ఎలాంటి సమీక్షలు చేశారు. రోజువారీగా వచ్చిన వరద వివరాలు, డ్యామ్ ల్లోని నీటిమట్టం వివరాలతో కూడిన పూర్తి సమాచారంతో ప్రభుత్వం తక్షణమే వరద నీటినిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
జగన్ సైలెంట్
అయితే, విపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడం కాకుండా తన పని ఏంటో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపారు. రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీఎం వైయస్ జగన్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. కేంద్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. “ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తింది.– దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాము.“ అని పరిస్థితిని వివరించారు.
ఆదుకోవాల్సిందే…
భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. “గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది. వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయి. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిల్చిపోయింది. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి. వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగింది.– ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది.“ అంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తద్వారా తాము పత్రికా ప్రకటనలకో, మీడియా రివ్యూలకో పరిమితం కాదని సీఎం జగన్ నిరూపించారు.