ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుండగా మరోవైపు మాటల యుద్ధం సైతం జరుగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల కేంద్రంగా విమర్శల పర్వం సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు తెరమీదకు వస్తున్నాయి.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.
స్థానిక సంస్థల ఎన్నికల కథ ఏంటంటే…
ఏపీలో ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మార్చి 15న ప్రకటించారు. మొత్తం రెండు దశల్లో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. 2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు కూడా అప్పుడు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
నిమ్మగడ్డ రచ్చ మామూలుగా లేదుగా
అయితే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కార్ తప్పు పట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్ఈసీగా తొలగించి మరొకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిపై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ను తిరిగి నియమించింది. ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు తెరమీదకు వచ్చింది.
28న అసలు కథే
ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయిందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.