వరుసగా కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షం ఎఫెక్ట్ ప్రతి ఒక్కరికీ పడింది. ఈ వర్షాలతో 30 మందికి పైగా మరణించగా హైదరాబాద్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారు. ఈ పరిణామం రాకజీయంగా విమర్శలు – ప్రతి విమర్శలకు కారణం అవుతోంది. కొందరిలోని మానవతా దృక్పథాన్ని తట్టిలేపుతోంది. అదే సమయంలో తెలంగాణ – ఏపీ పేరుతో విబేధాలకు కారణంగా మారుతోంది.
కేసీఆర్ కీలక నిర్ణయం
భారీ వర్షాలు, పలు కాలనీలు జలమయం అయిపోయిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం చెప్పారు.
వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్ధిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న నివాసాలకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
బ్రహ్మాజీ ట్వీట్ రచ్చ
మరోవైపు హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రోజుకో సెటైర్ వేస్తున్నారు. కొందరు ఓలా, ఉబర్ యాప్ ల్లో బోటు సర్వీస్ అవకాశం ఉందా అని అడుగుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా హైదరాబాద్ వరదలపై సెటైర్ వేసాడు. తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫోటోలను పోస్ట్ చేసిన ఆయన “ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి చెప్పండి ప్లీజ్” అని ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బ్రహ్మాజీ గురించి పలువురు ఏపీ – తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సినీ నటులు కొందరు హైదరాబాద్ వరదలపై సెటైర్లు వేస్తున్నారని కానీ వైజాగ్ వరదలతో దెబ్బతింటే మాత్రం వెంటనే సహాయం చేశారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటూ ఈ నగరం పట్ల చూపించే ప్రేమ ఇదేనా అంటూ విమర్శిస్తున్నారు. కాగా, తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు పది కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో పాటుగా మరింత సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.