ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా నిమ్మగడ్డ, వైసీపీ వ్యవహారం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు జేబు సంస్థలా మార్చారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ `చంద్రబాబు – నిమ్మగడ్డ జాయింట్ కమిషన్” గా మార్చారని మండిపడ్డారు.
నిమ్మగడ్డ నిర్ణయం వెనుక కుట్ర?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని అంబటి రాంబాబు వెల్లడించారు.“ఎన్నికల కమిషన్ కు ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టే పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకువచ్చారు. ఇది దేశంలోనే అందర్నీ ఆశ్చర్యపరిచే అంశం. చివరకు ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పక్షాలను కూడా ఈరోజు సమావేశానికి పిలిచారు, ఇదే ఎన్నికల కమిషనర్ కరోనా పేరు చెప్పి ఆరోజు స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలను పిలవలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం“ అంటూ సూటి ప్రశ్న వేశారు. ఆరోజు మీ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉండబట్టే, ఎవర్నీ సంప్రదించలేదు అన్నది మీ చర్యల ద్వారా రూఢీ అవుతుంది అంటూ అంబటి రాంబాబు సంచలన కామెంట్లు చేశారు.
ఈ పాయింట్లో నిమ్మగడ్డ ఇరుక్కుపోయినట్లే?
ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆరోజు కేవలం 3-4 కరోనా కేసులు ఉంటే, నేడు రోజుకు 3వేలుపై చిలుకు కేసులు వస్తున్నాయని పేర్కొన్న అంబటి రాంబాబు ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే పరిస్థితి ఉంది. “2018లో జరపాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ జరపలేదు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని నాడు సహకరించాం. అయితే, కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్థాంతరంగా కోవిడ్ పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేశారు. సీయస్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో మాట్లాడుతున్నానని చెబుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ, అన్ని రాజకీయ పక్షాలను పిలవాలని నిర్ణయించక ముందే ఎందుకు వీరిని సంప్రదించలేదు, అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్టు స్పష్టం కావడం లేదా..?“ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
నిమ్మగడ్డ ప్రాణాలకు ముప్పుందా?
ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా తయారైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారంటే ఎవరు నమ్ముతారు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. “గతంలో ఎన్నికలను వాయిదా వేసిన వెంటనే.. 18వ తారీఖున కేంద్ర హోం శాఖ సెక్రటరీకి లేఖ రాసిన నిమ్మగడ్డ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పార్టీ అని, అక్రమాల పార్టీ అని, ఫ్యాక్షనిస్టుల పార్టీ అని పేర్కొన్నారు. ఆ లేఖ చంద్రబాబు రాయిస్తే నిమ్మగడ్డ సంతకం పెట్టి.. మళ్ళీ ప్రాణ రక్షణ లేదని మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వన్ టూ వన్ సమావేశాలు పెట్టి, రాజకీయ పార్టీల నాయకుల్నే అందర్నీ ఒకచోట కుర్చోబెట్టలేని పరిస్థితుల్లో మనం ఉండి, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాలంటే ఎలా కుదురుతుంది..? రాజకీయం పార్టీల నుంచి రిప్రజంటేషన్ తీసుకుని, రాజకీయం చేయాలని, ఎన్నికల కమిషన్ కూడా రాజకీయ డ్రామాలు ఆడే దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకువచ్చింది మీరు కాదా?- రాజకీయ పార్టీల నేతలతో వన్ టూ వన్ సమావేశాలా..? ఒకరు మాట్లాడింది మరొకరికి తెలియకూడదా..? రహస్యంగా ఎందుకు మాట్లాడాలి, ఇలాంటి రహస్య మంతనాలు చేసే ధోరణి కుట్ర రాజకీయం కాక మరేమిటి..?“ అంటూ అంబటి ప్రశ్నించారు.