రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సాధారణమే. అయితే మారుతున్న కాలక్రమేణా ప్రతిపక్షంలో ఉండటానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇష్టపడటం లేదు. ఏమ్మెల్యేలుగా గెలిచిన తరువాత అధికార పక్షంలో ఎప్పుడు దూకేద్దామా, తమ తప్పులను ఎంత వరకు కడిగేసుకుందామా అనే ప్రయత్నంలోనే చాలా మంది ఉంటున్నారు. అయితే జగన్మోహనరెడ్డి సిఎం అయిన తరువాత ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమో, ఫిరాయింపులకు అడ్డుపడుతుందేమో అని అందరూ వేచి చూశారు. కానీ ఏ కారణం చేతనో జగన్మోహనరెడ్డి కూడా పాతపద్ధతిలోనే పరోక్షంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రత్యర్ధిపార్టీలను బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపికి దూరం అయి పరోక్షంగా వైసిపికి జై కొట్టారు. ఆ ముగ్గురు ఇప్పుడు టిడిపికి రెబల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు టిడిపికి ఎందుకు వీడారు. అధికార పక్షంలోకి ఎందుకు దూకేశారు. వారు చేసిన అవినీతి పాపాలు కనుమరుగు అవ్వడానికేనా, వారి పట్ల కేసులు లేకుండా ఉండటానికేనా అనేది కొత్త సందేహాలు నెలకొంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మద్దాలి గిరి విషయంలో ఒక కేసు బయటకు రావడంతో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలపైనా కొన్ని కేసులు ఉండటంతో వాటిని అన్నింటినీ కడిగేసుకునే క్రమంలోనే అధికార పక్షంలోకి దూకేశారని ఆ నియోజకవర్గాల్లో బాగా వినిపిస్తోంది.
ఒకొక్కరిపై ఒకో రకమైన కేసులు
* సామాగ్రి అపహరణ కేసులో ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులుక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు సంబంధించిన రెడిమెడ్ వస్త్ర దుకాణంలో కొందరు దౌర్జన్యం చేసి కోటి 50లక్షల విలువైన సామాగ్రి అపహరించారనీ దుకాణ యజమాని కొప్పురావూరి శివప్రసాద్ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎస్పి గ్రీవెన్స్ లోనూ ఫిర్యాదు చేశారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధితుడు శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి వత్తిడి కారణంగానే పోలీసులు తమ కేసును పట్టించుకోలేదనీ, ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతుతోనే తమ షాపులలోని వస్తువులను అపహరించారని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్లో ఆరోపించారు. తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారనీ. ఆ క్రమంలో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యే మద్దాలి గిరితో సహా గుంటూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.
* కాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికలకు ముందు తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రజలకు నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారని ఆరోపణ ఉంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాపులపాడు తహశీల్దార్ నర్శింహరావు ఫిర్యాదు మేరకు గత ఏడాది అక్టోబర్ నెలలో వల్లభనేని వంశీ, అయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతర పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ అధికార వైసిపికి దగ్గర అయ్యారు.
* అదే విధంగా అధికార పార్టీకి దగ్గర అయిన కరణం బలరాంపైనా కేసులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా బల్లికెరువులో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. దాన్ని లీజు పేరుతో వేరే వాళ్లు నిర్వహిస్తున్నారు. అయితే పరోక్షంగా వీళ్లకే సంబంధించిన లీజు అని టాక్, అందుకే ప్రభుత్వం తాజాగా 35 కోట్ల జరిమానాకు వీరి పేరిట నోటీసులు పంపించింది. ఈ జరిమానా తప్పించుకోవడానికి, ఇదే క్రమంలో ఎమ్మెల్యే బలరాం ఎన్నిక చెల్లదు అంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోర్టులో పిటీషన్ వేశారు. బలరాంకు రెండవ భార్య ఉన్న విషయాన్ని, ఆమె ద్వారా కల్గిన కుమార్తె విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొనలేదని, అఫిడవిట్ లో అవాస్థవాలు చెప్పిన కారణంగా, విషయాన్ని దాచిన కారణంగా ఆయనను అనర్హుడుగా పేర్కొనాలని ఆమంచి కృష్ణమోహన్ కోర్టులో వేసిన పిటీషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అందుకే ఈ రెండు కేసుల నుండి తప్పించుకునే క్రమంలో కరణం బలరాం కూడా టిడిపి నుండి అధికార వైసిీపిలోకి దూకేశారని ఇప్పటికీ నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆ సామాజిక వర్గం అన్నా, ఆ పార్టీ అన్నా పూర్తిగా దూరం పెట్టే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ..కరణం బలరాం, వల్లభనేని వంశీ విషయంలో ఎందుకు కాంప్రిమైజ్ అయి పార్టీలో చేర్చుకున్నారు, ఎందుకు వాళ్ల మద్దతు తీసుకున్నారు అనేది ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చగానే మిగిలింది. వాళ్ల చేరిక వల్ల వైసిపికి, జగన్ కు వచ్చిన అదనపు లాభం ఏమీలేకపోయినప్పటికీ వాళ్లకు మాత్రం స్వతహాగా సొంతంగా కేసుల నుండి విముక్తితో పాటు అధికారదర్పం కూడా కల్గింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?