‘ఎన్నికలంటే కురుక్షేత్ర మహాసంగ్రామం లాంటిది’ అని చిరంజీవి ముఠామేస్త్రి సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితి అలానే మారిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం.. తమ ప్రచారంలో వేగం పెంచాయి. మాటల యుద్ధాలకు దిగుతున్నారు. జీహెచ్ఎంసీ పీఠంపై కూర్చోవాలని అడుగులు వేస్తున్నాయి. ప్రచారంలో మాటల వేడి పెంచుతూనే సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. పొత్తుల్లేకుండా ఎవరికివారు పోటీ చేస్తున్నా.. కాస్త లోతుగా ఆలోచిస్తే బీజేపీ-ఎంఐఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉందనేది స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఆమధ్య మహారాష్ట్ర, ఇటివల బీహార్ ఎన్నికల్లో ఉపయోగించిన స్ట్రాటజీని బీజేపీ పాటిస్తోందని తెలుస్తోంది. ఈ వ్యూహం వల్ల ఇద్దరికీ లాభమే అని అర్ధమవుతోంది.
బీజేపీ-ఎంఐఎం.. నువ్వా నేనా? నిజమేనా?
ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ-ఎంఐఎం నువ్వా నేనా అన్నట్టు కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరిద్దరి వాదనలు విన్నవారికి హైదరాబాద్ లో మతఘర్షణలు జరిగిపోతున్నాయి.. అనేంతగా ప్రజల మధ్యలో సంభ్రమాశ్చర్యాలు, ఆందోళన కలగడం ఖాయం. కానీ.. ఎంఐఎం అంతకు సాహసించనూ లేదు.. బీజేపీ అంతకు తెగించనూ లేదు. మొన్నటి బీహార్ ఎన్నికలను పరిశీలిస్తే.. బీజేపీ వ్యతిరేక కూటమి.. మహాఘట్ బంధన్ తో కలవకుండా ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసి ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ లాభం పొందింది. ఇప్పుడదే ప్రాతిపదికన హైదరాబాద్ లో ముస్లిమేతర ఓట్లు బీజేపీకి పడాలంటే హిందూ సెంటిమెంట్ రగలాలి. ఇది జరగాలంటే.. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టాలి.. బీజేపీ వారిని శాంతపర్చాలి. ఈ స్ట్రాటజీనే రెండు పార్టీలు పాటిస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇదంతా మొన్నటి బీహార్ స్ట్రాటజీనే..!
బీహార్ ప్రచారంలో బీజేపీ మతపరమైన అంశాలు, ఎంఐఎం బాబ్రీ మసీదు, CAA, ఆర్టికల్ 370లను ప్రస్తావించాయి. ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. తమ మైనార్టీల ఓట్లను చీల్చి ఈ రెండు పార్టీలు లాభ పడ్డాయని కాంగ్రెస్ వాదించింది. బరారిలో 11వేలకు పైగా ఓట్లతో ఎన్డీఏ గెలిచింది. ఎంఐఎంకి 6598 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 5500 ఓట్లు కాంగ్రెస్ కూటమికి పడుంటే వారే గెలిచేవారు. నర్పట్ గంజ్, రాణిగంజ్, సాహెబ్ గంజ్ ల్లో కూడా ఇవే వ్యూహాలు పనిచేశాయని అంటున్నారు. 2017లో యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన 29 స్థానాలు, 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో ఎంఐఎం గెలిచిన రెండు స్థానాల్లో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారని అంటున్నారు. మైనార్టీ ఓట్లను ఆకర్షించి కాంగ్రెస్ కూటమికి నష్టం చేసి బీజేపీ మిత్రపక్షాలను గెలిపించడమే ఈ ప్లాన్ అని కాంగ్రెస్ వాదించింది.
బీజేపీ టార్గెట్లకు ఎంఐఎం సాయం.. నిజమేనా?
ఇప్పుడు బీజేపీ ముందు రెండు టార్గెట్లు ఉన్నాయి. ఒకటి గ్రేటర్ లో గెలవడం.. రెండోది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఎంఐఎం మధ్యే వారధిగా నిలుస్తోంది. ఎవరి వర్గం ఓట్లు వారికి పడాలంటే ఎంఐఎంతో హిందువులను తిట్టించి.. బీజేపీతో శాంతపరిస్తేనే ఈ రెండు పార్టీలకు లాభం. ఇదే ఆలోచన అమిత్ షాకు వచ్చిందనడంలో సందేహం లేదు. లోతుగా ఆలోచిస్తే తత్వం బోధపడక మానదు..!!