ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన హైదరాబాద్లో నివసించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, చంద్రబాబుకు అమరావతిలోనూ నివాసం ఉన్న సంగతి తెలిసిందే. ఆ నివాసం గురించి తాజాగా కీలక ఘటన జరిగింది. కృష్ణా నది కరకట్ట లోపల చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నివాసానికి అధికారులు నోటీసులు అందజేశారు.
కరకట్ట రచ్చ రచ్చే
కృష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. కృష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. అప్పుడే చంద్రబాబు నివాసం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
బాబు ఇల్లు మళ్లీ…
భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపల వైపు ఉన్న భవనాలు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. ఏ క్షణాన్నయినా ఇళ్లల్లోకి నీరు రావొచ్చని అధికారులు అలర్ట్ చేశారు.
సోషల్ మీడియాలో సెటైర్లు
అయితే, తాజాగా చంద్రబాబు నివాసం గురించి మళ్లీ సోషల్ మీడియాలో మళ్లీ సెటైర్లు వేస్తున్నారు. కరకట్ట నివాసం విషయంలో తాజా నోటీసులతో బాబుకు బీపీ పెరిగిపోతోందని టాక్ జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబులో ఆందోళన మొదలైందని అంటున్నారు.