పండుగ పూట విషాదం గురించి మాట్లాడటం ఎందుకు? పండుగ సంబురాన్ని ఆస్వాదించకుండా ఇలా హెచ్చరికలు ఏంటి అని అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే… నిజం తెలియడమే మంచిది అయింది అని అనుకుంటారు.
అంతేకాకుండా జాగ్రత్త పడతారు. ఈ దసరా, దీపావళి పండుగ సమయాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. ఇది అంచనా కాదు. నిజం. ఔను. కేరళలో రుజువైంది. అందుకే కాస్త జాగ్రత్త.
విషాదమే….
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ‘సండే సంవాద్’ పేరుతో సోషల్ మీడియా లైవ్లో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఓనం పండుగ ఘనంగా చేసుకోవాలన్న ఆలోచనతో కరోనా నిబంధనలను లైట్ తీసుకోవడం వల్ల కేరళలో రోజువారీగా కరోనా కేసుల నమోదు గతంలో కన్నా రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఓనం పండుగ సమయంలో కేరళ ప్రభుత్వం భారీగా ఆంక్షలు సడలించిందని, దానికి ఇప్పుడు ఆ రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు. భారీగా ప్రయాణాలు చేసేందుకు ప్రజలకు వీలు కల్పించడం, ఓనం సందర్భంగా జనాలు గుంపులుగా చేరి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి అదుపు తప్పిందని విశ్లేషించారు. కేరళ ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం వల్ల అక్టోబర్ 1 నుంచి 17 మధ్య ఏకంగా లక్షా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.
హైదరాబాద్లో ఇంకా డేంజర్
ఇక వరదలు ముంచెత్తుతున్న హైదరాబాద్ గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వరదలు, కరోనాపై పరిస్థితులపై ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఈ మేరకు కోఠిలో ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా, వరదలు రెండు సమస్యలు ఉన్నాయని దీంతో జీహెచ్ఎంసీ చుట్టుటూ పక్కల ప్రాంతాలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఏడెనిమిది నెలలుగా 0.57 శాతం డెత్ రేట్.. సుమారు 90 శాతం రికవరీ రేట్..22 వేల కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అందులో 4 వేల మంది హాస్పిటల్స్ లో ఉన్నారని..38 లక్షల పైగా టెస్ట్ లు చేసామని వెల్లడించారు. రాష్ట్రంలో 15 వందల కంటే తక్కువగా కేసులు వస్తున్నాయని.. Ghmc పరిధిలో 200 వరకు మాత్రమే కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు.
పండుగలతో జాగ్రత్త
పండగల సీజన్ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పండగ వాతావరణం ఎక్కువ అని తెలిపారు. డిసెంబర్ వరకు కీలకమైన రోజులని..షాపింగ్, ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పండగ చేసుకోవడం వీటి ద్వారా ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుందని తెలిపారు. లక్షణాలు లేని వాళ్ళ వల్ల కరోనా స్ప్రెడ్ ఎక్కువగా ఉందన్నారు. దీనికి కేరళ, ఢిల్లీ ప్రత్యేక్ష సాక్ష్యమన్నారు. కేరళలో జరిగిన ఓనమ్ పెస్టివల్ వల్ల కేసులు 10 వేల కేసులు పెరిగాయని..పండగ చేసుకోవద్దని చెప్పడం లేదు.. కుటుంబ సభ్యులతో చేసుకోండి అని పేర్కొన్నారు. చలి కాలం అన్ని వైరస్ లకు అనువైన కాలం.. బాగా విస్తరిస్తుందని హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలీదు.. వచ్చినా ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదని పేర్కొన్నారు. అందుకే స్పెషల్ క్యాంపెయిన్ ను ప్రారంభించామని..సోషల్ మీడియా, రేడియోలలో ప్రకటనలు ఇస్తున్నామన్నారు. సో… ఈ పండుగ మన ఇళ్లల్లో విషాదం నింపకూడదు అనుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.