‘తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు’ అనేది ఓ సామెత. ఈ సామెత ఇక్కడ పనిచేస్తుందో లేదో గానీ ఈ కథనం చదివితే కాస్త నిజం అనిపిస్తుంది. బీజేపీ-ఎంఐఎం దోస్తీపై వస్తున్న ఊహాగానాలపై ఉన్న ఒకొక్క పొర వీడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీల ప్రచారశైలిని గమనించిన వారికి.. వీరిద్దరి మధ్య ఏదన్నా లోపాయకారి ఒప్పందం ఉందా అనే అనుమానాలు వచ్చాయి. ఏ తెరచాటు రాజకీయంతో బీహార్లో మ్యాజిక్ చేశారో ఇక్కడా అదే చేయాలని తలచి దొరికిపోయారు. బీజేపీకి లాభించేలా ఎంఐఎం మైండ్ గేమ్ ఆడుతోందని విస్తృతంగా వచ్చిన వార్తలు నిజమేనని బెంగాల్ లో మారిన రాజకీయ సమీకరణాలు నిరూపిస్తున్నాయి.
బెంగాల్లో ఎంఐఎం పరిస్థితి..!
బెంగాల్ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరటం తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగాల్లో కూడా చక్రం తిప్పాలనుకున్న బీజేపీ-ఎంఐఎంకు ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అన్వర్ హుస్సేన్ పాషా రాజీనామా ఈ రెండు పార్టీలకు శరాఘాతంలా తగిలింది. వెళ్తూ.. వెళ్తూ ఆయన చేసిన ఆరోపణ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ‘హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఎంఐఎం రాజకీయాలు చేస్తోంది. బీహార్లో జరిగింది ఇదే. బెంగాల్లో ఎంఐఎంకు ఆ అవకాశం ఇవ్వం. ఇక్కడకు రావడానికి ఓవైసీ రాకూడదు. రాజకీయాలను మతం కోసం వాడుకునే కొందరికి బెంగాల్లో చోటు లేదు. అది కాషాయమైనా.. ఆకుపచ్చ అయినా ఒకటే’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలతో రాజకీయ పార్టీలు ఆడుకునే ఆటలను బహిర్గతం చేశాయి.
ప్రజల నమ్మకాన్ని గెలవగలరా..?
ఇన్నాళ్లూ బీజేపీ-ఎంఐఎం అంటే మతతత్వ పార్టీలనే ముద్ర ప్రజల్లో ఉండేది. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు వ్యవహారమనే అనుకున్నారు. మొన్నటి మహారాష్ట్ర, నిన్నటి బీహార్, ఇప్పటి జీహెచ్ఎంసీ ప్రచారంలో కూడా నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకున్నట్టే వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. కానీ.. అసలు లోగుట్టు ఇదనీ.. రేపు బెంగాల్లో జరగబోయేదీ ఇదేనని హుస్సేన్ నిరూపించారు. మతం రంగుతో ప్రజలను రాజకీయాలను వాడుకోవాలని నేతలు ఆలోచిస్తే.. వారి సమీకరణాలను పసిగట్టలేని ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు లేకపోలేదు. పైన చెప్పిన సామెత ఇందుకే. ఆయా పార్టీలను అభిమానించే ప్రజలకు ఇది నిజంగానే షాక్ ఇచ్చేదే. మరి.. ఇరు పార్టీల నేతలు ఎలా సమర్ధించుకుంటారో.. చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?