తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఊహించని వ్యాఖ్యలు చేసింది.
టీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసే టార్గెట్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి తనయుడి ఇలాకాలోనే ఆయనపై ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన యాత్ర పేరుతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పరిస్థితులను ఆయన మీడియాకు వెల్లడించారు.
షాడో సీఎం కేటీఆర్…
తెలంగాణ సీఎల్పీ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి సమస్యలను.. స్థానికులు సీఎల్పీ బృందం దృష్టికి తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తూ.. కరోనా గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడే మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో కరోనా రోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందని ఆరోపించారు. కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడే మాటలకు.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని.. సీఎల్పీ నేత భట్టి ఎద్దేవా చేశారు.
ఇదిగో ఇందుకే కేటీఆర్ పరువు తీసేశారు
సిరిసిల్ల నియోజకవర్గం వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. మంత్రి కేటీఆర్ పట్టించుకోవటం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉండటం.. కేటీఆర్ పని తీరుకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేక పోవటంతో అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన భట్టి.. ఈ చావులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గైనకాలజిస్ట్ లేక గర్భిణీలు ఇబ్బంది పడుతుండగా.. విధులు నిర్వహించటానికి డాక్టర్లు సైతం జంకుతున్నారని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో సుమారు 18 మంది కరోనాతో చనిపోయారంటే సిరిసల్లలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. షాడో సీఎంగా చెప్పుకునే కేటీఆర్ నియోజకవర్గంలోనే సరైన వైద్య సదుపాయాలు కల్పించలేనప్పుడు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం వైద్య సహాయం అందిస్తుందో ప్రజలు ఆలోచించాలని సీఎల్పీ నేత భట్టి విజ్ణప్తి చేశారు.