హైదరాబాద్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టేంత గ్యాప్ కూడా ఇవ్వని రీతిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమయంలో అధికార పార్టీ నేతలకు ఊహించని షాకులు తగలుతున్నాయి. మంత్రుల నుంచి మొదలుకొని కార్పొరేటర్ల వరకూ పరాభవాలు తప్పడం లేదు. వరదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తుండగా… వారికి ప్రజల నుంచి అసహనం ఎదురవుతోంది.
తలసానికి ఇలా జరిగింది
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అరుంధతి నగర్, అడిక్మెట్ డివిజన్ నాగమయ్య కుంట, పద్మ కాలనీలో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను పరామర్శించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా నాగమయ్య కుంటలోని మహిళలు.. ‘నీళ్లున్నప్పుడు రాకుండా క్లీన్ చేసుకున్నంక వస్తారా’ అని నిలదీశారు. పడుకోవడానికి స్థలం లేక పిల్లలను ఎత్తుకుని నీళ్లలో నిలబడ్డామని.. నీళ్లు గాని, తిండి గాని ఎవరూ అందించలేదని చెప్పారు. దీంతో మంత్రి ఏం వినపడనట్లు ముందుకు సాగిపోయారు. తర్వాత తలసాని మాట్లాడుతూ.. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
ఎమ్మెల్యేకైతే ఏకంగా…
ఉప్పల్ ప్రాంతంలోని వరదల్లో పర్యటిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాగ్వివాదానికి దిగారు. వరదల్లో చిక్కుకున్న తమను సురక్షిత ప్రాంతానికి తరలించటం లేదంటూ మండిపడ్డారు. వరదల్లో ఇలాగే చిక్కుకుని చావాలా? అని ప్రశ్నించారు. నీటిలో చిక్కుకుని చనిపోయేటట్లయితే ‘నీ పేరు రాసి చస్తాం!’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా వేసుకోవటానికి దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలాంటి ప్రాంతంలో ఇళ్లేందుకు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. ‘విపత్కర పరిస్థితి ఇది.. వర్షం సడెన్గా వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిందానికి.. ఎవరూ బాధ్యులు కార’ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు ప్రశ్నిస్తుండగానే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
కార్పొరేటర్ కాలర్ పట్టుకున్నారు
హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై స్థానికుల దాడి చేసినంత పని చేశారు. హయత్ నగర్ రంగానాయకుల గుట్టలో నాల భూములన్ని కబ్జాలకు గురవుతున్నాయని ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పటించుకోలేదని సామ తిరుమల రెడ్డిని నిలదీశారు స్థానికులు. వర్షాలకు ఇళ్ళలోకి నీరు రావడంతో ఇండ్లు మునిగిపోతున్నాయని కాలని వాసులు కార్పోరేటర్ కాలర్ పట్టుకున్నారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు. చర్చి దగ్గర ఉన్న నాల కబ్జాకు గురైందని ఇన్ని రోజులుగా చెబుతుంటే.. ఎందుకు పట్టించుకోలేదని.. కాలని వాసులు కార్పొరేటర్ను ప్రశ్నించారు. భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న జనం ఇలా ప్రజా ప్రతినిధులపై తిరగబడుతున్న పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
రంగంలోకి కేటీఆర్
ఇదిలాఉండగా, నాలుగు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. చెరువు శిఖాలు, నాలాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కారణంగా వరద వెల్లేందుకు వీల్లేక ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నాలాలు అక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. హైదరాబాద్లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. GHMC సిబ్బంది వివిధ ప్రాంతాల్లో నాలాలపై అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేశారు.