ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడపలో సొంత పార్టీలోనే ముసలం పుట్టిందా?
తమ ఇలాకా అయిన కడప నుంచి రాజకీయాలను ప్రారంభించి సత్తా చాటుకున్న సీఎం జగన్ అక్కడ ఎదురయ్యే పరిస్థితులతో ఒకింత అప్ సెట్ అవుతున్నారా? తాజాగా సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
అంత చేస్తే ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలా గెలిచిన వారిలో జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒకరు. అయితే, ఆయనపై తాజాగా కొత్త ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకొని వచ్చింది మొదలు సుధీర్ రెడ్డి హర్టవుతున్నారట. ఇప్పుడు ఇది పీక్స్ కు చేరిపోయిందట. రామసుబ్బారెడ్డి ఏకంగా ఓ ఆఫీసు తెరిచి వైసీపీ ముఖ్య నేతగా చెలామణి అవడం తట్టుకోలేకపోతున్నారట జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
మండిపోతోందట…
రామసుబ్బారెడ్డి పెత్తనం చెలాయించడమే ఇబ్బందికరంగా ఉందనుకుంటున్న సమయంలో వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు మండిపడుతున్నారట. పాత టీడీపీ వాళ్లకే కడప జిల్లాలో.. నియోజకవర్గంలో పనులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని సుధీర్ రెడ్డికి అనుచలు ఫిర్యాదు చేశారట. దీంతో ఎవరైనా తన దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తే, వైసీపీ పేరు ఎత్తితే కోపంతో చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ గాలిలో అంత మెజార్టీ వస్తుందా? అంటూ ప్రశ్నించారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.
అబ్బే అవన్నీ ఒత్తి మాటలే…
అయితే, తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ ప్రచారంపై స్పందించారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇటీవల మీడియాలో తన పైన వచ్చినవ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని స్పష్టం చేశారు.
రాజీనామా చేసేస్తాను
సీఎం జగన్కు తాను ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని సుధీర్ రెడ్డి ప్రకటించారు.
తాను తొలినుంచీ వైఎస్సార్, జగన్ అభిమాని అని గుర్తుచేశారు. “నా మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. జమ్మలమడుగులో నా గెలుపునకు కారణం ఎంపీ అవినాష్ రెడ్డే. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు విమర్శిస్తాను? తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగానే ఉంటాను. ఇకనైనా నాపై అసత్య ప్రచారాలు మానుకోండి’ అని అన్నారు. తాను కడప జిల్లాకు చెందిన వ్యక్తినని, తన భాష ఇలాగే ఉంటుందని సుధీర్ రెడ్డి తెలిపారు.
రఘురామ కృష్ణంరాజు ఎంట్రీ
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో తనను పోల్చడం దారుణమని, ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని సుధీర్ రెడ్డి అన్నారు. ‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చొని వున్నారు.` అంటూ సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.