ఆళ్ల రామకృష్ణారెడ్డి… మంగళగిరి ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు. సౌమ్యుడైన ఈ రాజకీయవేత్త ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్పై గెలుపు సాధించడం ద్వారా ఆర్కే సత్తా సుపరిచితం అయింది. అయితే, అలాంటి ఆర్కేకు ఏపీలోనే మోసం జరిగింది. తాజాగా ఓ కంపెనీ ఆయన నమ్మిన వ్యవసాయంలోనే షాక్ ఇచ్చింది.
ఆర్కే ప్రేమ ఆధారంగా….
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యవసాయం ఆధారంగానే ఓ కంపెనీ మోసం చేసింది. విత్తన కంపెనీ చేతిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మోసపోయారు. 14 ఎకరాల్లో పంట వేయగా 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలు ఆర్కే కొనుగోలు చేశారు. పంట నష్టంతో వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యేకే కంపెనీ బురిడీ కొట్టించడం సంచలనంగా మారింది.
ఆర్కేకు ఇది రెండో షాక్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇటీవల జరిగిన షాక్లలో ఇదో రెండోది. ఆర్కేతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు కొందరు విలేకరులపై సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్సీ అనుచరులే దుష్ప్రచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఆర్కే పేరుతో అదిరిపోయే స్కాం
2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్కు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్కుమార్ కీలక పాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్ పేరు బయటకు రావడంతో ఆయన పీఆర్వో దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, ఓ విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఉదంతం ఆర్కేను ఆయన మనుషులను షాక్కు గురి చేసింది.