విజయసాయి రెడ్డి వైసీపీలో ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే ముగ్గురు, నలుగురి పేర్లు ఉన్నప్పటికీ మొదట గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి పేరే. జగన్ తో పాటు జైలులో గడిపారు. జగన్ తో పాటు 2014 ఎన్నికలలో వ్యూహలు రచించారు. జగన్ తో ఓటమిలోనూ తోడు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంలో కీలక పాత్ర విజయసాయి రెడ్డిదే. తెరపైన కార్యక్రమాలు, వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే, తెరవెనుక ప్రచారాన్ని, రాజకీయ వ్యూహాలను, అధ్యయనాలను, జిల్లాల వారీగా సమాచార సేకరణలోనూ, సోషల్ మీడియాను విజయసాయి రెడ్డి హ్యాండిల్ చేశారు. అటువంటి విజయసాయి రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఎక్కడో చెడింది. అందుకే పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకు లోపించింది. చివరికి ఆయన మాట కూడా నెగ్గడం లేదు. ఇవి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే అంశమే.
ఢిల్లీ వ్యవహారాలే కారణమా? విశాఖా??
విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా, పార్టీ ప్రతినిధిగా ఢిల్లీలో ఉంటూ అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించే వారు. రాష్ట్రంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తునే కొన్ని సోషల్ మీడియా సహా కొన్ని విభాగాలు నడిపిస్తూనే ఢిల్లీలో జగన్ కు కావలసిన అన్ని పనులు చక్కబెట్టే వారు. బీజేపీతో సమన్వయం చేయడంలో ఆయన పాత్ర కీలకం. సీఎం జగన్ కు బీజేపీ పెద్దల, కేంద్ర అపాయింట్మెంట్ మొదలుకొని అక్కడ రాజకీయ వ్యవహారాలు, కేసులు, పాత వ్యవహారాలు ఏమన్నా చక్కబెట్టాలన్నా విజయసాయి రెడ్డే ఉండాలి. అటువంటిది ఆరు నెలల నుంచి విజయసాయి రెడ్డి పాత్ర తగ్గింది. ఢిల్లీ నుంచి ఆయనను దూరం చేశారు.లేదా ఆయనే దూరం అయి ఉంటారు. దీనికి సంబంధించి కారణాలు ఏమిటి అని స్పష్టంగా తెలియనప్పటికీ కొన్ని పుకార్లు మాత్రం నడుస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో రద్దయింది. అంతకు ముందు నెలలో కూడా ఇదే తరహాలో అమిత్ షా, ప్రధాన మోడీ ఇద్దరి అపాయింట్మెంట్ లు తీసుకున్నప్పటికీ ఆకస్మికంగా రద్దయ్యాయి. దీంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి విజయసాయి రెడ్డి వల్ల ఢిల్లీ లో పనులు అవ్వడం లేదని భావించి అతనిని రాష్ట్రానికే పరిమితం చేశారు అనేది ఒక పుకారుగా నడుస్తుంది. ఇక రెండవ పుకారు చేసుకున్నట్లు అయితే విశాఖలో భూముల వ్యవహారం. విశాఖపట్నంలో రాజధాని పెట్టాలి అని అనుకుంటున్నప్పటి నుంచి విజయసాయి రెడ్డి విశాఖలోనే తిష్ట వేస్తూ వస్తున్నారు. అక్కడి వ్యవహారాలు, అక్కడి అధికారులతో సర్దుబాట్లు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని అన్ని విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో విశాఖ భూ వ్యవహారాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు రావడం, మంత్రి అవంతితో విజయసాయిరెడ్డికి స్వల్ప వివాదాలు రావడం, విజయసాయిరెడ్డిపై అవంతి శ్రీనివాస్, అవంతిపై విజయసాయి రెడ్డి ఫిర్యాదులు చేసుకోవడం ఇది కాస్తా గుప్పుమనడంతో విజయసాయి రెడ్డి వ్యవహార శైలిపై జగన్ గుర్రుగా ఉంటూ కాస్త దూరం పెట్టారని అంటున్నారు.ఇంకా ఇతరత్రా పుకార్లు చాలా ఉన్నప్పటికీ ఇవన్నీ పార్టీ అంటే పడనివారు కల్పించిన ప్రచారమే అని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
దగ్గర అవుతారా..? ఇంకా దూరం అవుతారా..??
పార్టీలో విజయసాయి రెడ్డి పాత్ర, అయన జగన్ కు ఎందుకు దూరం అయ్యారు? ఎలా దూరం అయ్యారు అనే పుకార్లు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇక ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉందా? పార్టీలో మరింత చురుగ్గా వ్యవహరించనున్నారా? అనేది చెప్పుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి మాత్రం ఇది ప్రస్నార్ధకమే. వైసీపీలో నెంబర్ 2 స్థానాన్ని ఆశించిన ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. అందుకే ఇప్పుడు నెంబర్ టూ ఎవరు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. పార్టీలో రాజకీయ వ్యవహారాలు, ఎమ్మెల్యేలతో సమన్వయం కూడా విజయసాయి రెడ్డి పాత్ర కంటే అధికంగా సజ్జల రామకృష్ణారెడ్డే తీసుకున్నారు. సీఎం జగన్ తో అపాయింట్మెంట్ లు మొదలుకొని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రాజకీయ వ్యవహారాలు, చిన్న పాటి పనులు ఏమి చేయించాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి విజయసాయి రెడ్డి ఇవేమి ఊహించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే విజయసాయి రెడ్డికి వైసీపీనే సర్వస్వం. ఆయన వ్యక్తిగతంగా కంటే పార్టీలో జగన్ కు నీడగా, జగన్ కు సన్నిహితుడిగానే వైసీపీ వర్గాలకు, రాష్ట్రంలోని కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు. ఆయన ప్రతిష్ట అమాంతం పెరిగింది. ఈ తరుణంలో ఆయన జగన్ ను దూరం చేసుకోలేరు. అలాగని మరింత దగ్గర అవ్వలేరు. ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారాన్ని, కొద్దిపాటి దూరాన్ని అదే క్రమంలో నిర్వహిస్తూ కొన్నాళ్ళు గడుపుతారు. తర్వాత జగన్ కి, విజయసాయి రెడ్డికి మధ్య బంధాన్ని కాలమే నిర్ణయిస్తుంది.