విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని సోమిరెడ్డి హెచ్చరించారు.
విజయవాడలో మంగళవారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు ఇంట్లో కూర్చువాలంటే సహించమన్నారు. సమీక్షలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. పరిపాలించటం రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కు అని సోమిరెడ్డి అన్నారు. ఎన్నికల అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప ప్రభుత్వం యథాతథంగా విధులు నిర్వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన మాట విజయసాయి రెడ్డికి గుర్తులేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
2004లో ఆరు నెలల ముందు రాజీనామా చేసినా రాష్ట్రానికి కేర్ టేకర్గా చంద్రబాబే ఉన్నారని సోమిరెడ్డి గుర్తుచేశారు.
రాష్ట్రంలో పరిపాలన సాగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుట్రలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే భాద్యత వహించేది ఎవరని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల మృతికి తెలంగాణ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ఏడాదికో పార్టీ మారే ఆనం రాంనారాయణ రెడ్డికి మతిమరుపు వచ్చిందని సోమిరెడ్డి విమర్శించారు. ఆర్బిఐ నియమాలు తెలియాని ఆనం ఆర్ధిక మంత్రిగా ఎలా పని చేశారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.