ఏపీ కొత్త బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మంచి దూకుడు మీద ఉన్నారు. బిజెపి పార్టీకి హైకమాండ్ బిజెపి పార్టీ యే అని, ఇతర పార్టీ చెప్పుచేతల్లో నడిచే రోజులు పోయాయని ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో యాంకర్ కి మతి పోయేటట్టు సోము వీర్రాజు కామెంట్లు చేశారు. మూడు రాజధానులు విషయంలో యాంకర్ కి చెమటలు పట్టించేలా వ్యవహరించారు. హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అందులో నిర్మొహమాటం ఉండదని పేర్కొన్నారు.
ఇలాంటి తరుణంలో 3 రాజధానుల నిర్ణయం విషయంలో మొదటి నుండి సోము వీర్రాజు అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. పార్టీపరంగా మేము అమరావతికి మద్దతు తెలుపుతామని చెప్పడం తెలిసిందే. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ నేత టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓ వి రమణ మూడుముక్కలాట తో నష్టపోతున్న బిజెపి అంటూ ఇటీవల ఓ తెలుగు దిన పత్రికలో వ్యాసం రాశారు. దెబ్బకి పార్టీ లైన్ దాటడంతో… సోము వీర్రాజు ఎఫెక్టుతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడినందుకు ఓవీ రమణ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ఆ వ్యాసంలో రమణ రాసింది ఏమిటి అంటే…కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్న సమయం వరకు అమరావతి రాజధాని కి బీజేపీకి అనుకూలంగా ఉందని దీక్షలు చేశారు మీడియా సమావేశాలు పెట్టి భారీ డైలాగులు వేశారు. ఇప్పుడేమో రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని సరికొత్త ప్రవచనాలు వల్లిస్తున్నారు. దీంతో బీజేపీ పైన ప్రజలలో ఉన్న నమ్మకం ఒక్కసారిగా అట్టడుకి వెళ్లి పోయింది.
కొత్తగా వచ్చిన అధ్యక్షుడు… రాజధాని విషయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే అని చెప్పటం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, మరి మద్దతు దేనికి ఇస్తున్నట్లు ? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడిన బిజెపి ని ప్రజలు శంకించే పరిస్థితి ఏర్పడిందని ఓ వి రమణ ఏపీ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు ఏ మాత్రం ఆలోచించకుండా రమణ ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.