ఉమ్మడి ఏపీ.. తర్వాత ఏపీలో మాత్రమే కులాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు, రెడ్డి సామాజికవర్గానికి సీఎం వైఎస్ జగన్ ఉన్నట్టు కాపులకు ప్రత్యేకించి లేరు. గతంలో వంగవీటి రంగా కాపుల చిరునామాగా ఉన్నా.. ఆయన హత్య తర్వాత రాజకీయాల్లో కాపుల ప్రాబల్యం లేకపోయింది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉన్నా.. సినీ నటులుగా వారికున్న అశేష ప్రేక్షకాభిమానం వల్ల ఆ ముద్ర పడలేదు. కాస్తో.. కూస్తో ముద్రగడ పద్మనాభం కాపులకు ప్రతినిధిలా కనిపిస్తారు. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రస్తావన వస్తే ఇంతకంటే కొత్తగా ఏమీ ఉండదు. అయితే.. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. దేశవ్యాప్తంగా మతతత్వ పార్టీగా పేరున్న బీజేపీకి ఏపీలో కొత్తగా కులం రంగు పులుముతున్నారు. గతంలో చిరంజీవి, పవన్ తో భేటీ అనంతరం ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడమే ఇందుకు ఉదాహరణ.
కాపుల కోసం ముద్రగడ..
నిజానికి ముద్రగడ పద్మనాభం ఒక రాజకీయ నేతగా, మంత్రిగా మాత్రమే ఉన్నారు. అయితే.. ఆయన 1994లో.. ‘కాపులను బీసీల్లో చేర్చాలి’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆరోజుల్లో అది మహోద్యమమే అయింది. మొత్తానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. దీంతో ఆ ఉద్యమం ఆగింది. రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కాపు వ్యక్తిగా.. కాపు ఉద్యమ నాయకుడిగా బలమైన ముద్రే వేసుకున్నారు. అయితే.. 1995లో కాంగ్రెస్ ఓటమి, టీడీపీ అధికారంలోకి రావడం, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికారం రావడం వంటి అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో మళ్లీ కాపుల ప్రస్తావన పక్కకు వెళ్లిపోయింది. అప్పటినుంచి ఏకంగా 2015 జనవరిలో మళ్లీ ముద్రగడ పద్మనాభమే కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనతో కాపులను బీసీల్లో చేర్చే అంశం ప్రముఖ వార్త అయింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది.
కాపులపై రాజకీయ నాయకులు..
నిజానికి వైఎస్ 2004లో అధికారంలోకి వచ్చిన సమయంలో కాపులను బీసీల్లో చేర్చే అంశం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. కానీ.. పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో, తెలంగాణ ఉద్యమంతో ఆ విషయం కొట్టుకుపోయింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు కాపులను బీసీల్లో చేరుస్తాం.. అంటూ ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ హామీనే ఆయుధంగా చేసుకుని ముద్రగడ ఉద్యమించారు. కాపుల అంశం తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో చంద్రబాబు.. సుప్రీంకోర్టు తీర్పు అడ్డు ఉన్నా.. కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించి పార్లమెంట్ కు బిల్లు పంపారు. ఇదంతా పొలటికల్ డ్రామా అన్నది ఎవరికైనా తెలిసిన అంశమే. 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కాపులు ఎక్కువగా ఉండే ఆ జిల్లాలోనే సంచలన ప్రకటన చేశారు. ‘కాపులను బీసీల్లో చేర్చలేను.. సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు అంగీకరించదు.. చంద్రబాబు కాపులకు చేసిన మోసం నేను చేయలేను’ అంటూ సంచలన ప్రకటన చేశారు. దీనిని టీడీపీ రాజకీయంగా వాడుకున్నా.. అంతిమంగా జగన్ మాటే నెగ్గింది. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ప్రజలు అత్యధిక సీట్లు కట్టబెట్టారు.
కాపులను ఈసారి ఏం చేస్తారో..!
అయితే.. ఇదే ముద్రగడ పద్మనాభం కూడా 1995 నుంచి 2015 వరకూ కాపుల సమస్యలు కానీ, బీసీల్లో చేర్చే అంశంపై కానీ మళ్లీ ఉద్యమించింది లేదు. ఒక్కసారిగా చంద్రబాబు హయాంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఆయన కూడా కాపుల కోసం కాదు.. రాజకీయ ప్రయోజనాలే ఆశించారు అనే అపప్రధను మూటగట్టుకున్నారు. ముద్రగడ వల్ల కాపుల ఉద్యమం బయటకు వచ్చిందేమో కానీ కాపులకు ఒనగూరిన ప్రయోజం సున్నా. మళ్లీ అప్పటినుంచి ముద్రగడ మళ్లీ సైలెంట్ అయిపోయారు. తెలంగాణ కోసం కేసీఆర్ పట్టిన ఉడుంపట్టు ముద్రగడ చేయలేదు. కారణం.. కాపులను బీసీల్లో చేర్చడం కష్టమని ఆయనకూ తెలుసు. ఇప్పుడు కొత్తగా సోము వీర్రాజు కాపులను బీసీల్లో చేర్చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఇందుకు ముద్రగడను ఈరోజు కిర్లంపూడిలో కలిసి మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ తర్వాత ఇప్పుడు కాపుల కోసం కొత్తగా బీజేపీ వచ్చింది. ఇప్పుడు కూడా కాపుల ఓట్లే ప్రాధాన్యం కానీ.. కాపులకు ఏమీ ఒనగూరే అవకాశం లేదు (గత అనుభవాల దృష్ట్యా). ఈ విషయం సగటు కాపులకు తెలుసు..!