రాష్ట్ర బీజేపీకీ కొత్త నాయకత్వం వచ్చింది. మూడు గుర్రాలపై చెంగు చెంగున పరిగెడుతోంది. తమకు అడ్డు వచ్చేవారిని, ప్రత్యర్ధులకు సహకరిస్తారని అనుకునేవారిని ఎడాపెడా వేటు వేసేస్తోంది. తమ లక్ష్యం వైపు పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగా సోము వీర్రాజు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని సస్పెండ్ చేసే క్రమంలో పెద్ద జాబితానే తయారు చేసుకున్నారట. వీరిలో ఇప్పటికే బీజేపీలో ఇద్దరిని సస్పెండ్ చేయగా.. రేపోమాపో మరో నాయకుడిని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వారెవరంటే..
లంకా దినకర్ పై వేటుకు సిద్ధం..
గతంలో టీడీపీ నాయకుడిగా ఉన్న లంకా దినకర్ ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఈయన టీవీ చానెల్స్ డిబేట్స్ తన వాయిస్ ను బలంగా వినిపిస్తూంటారు. ఇటివల అమరావతి రాజధాని తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. గతంలో జగన్ పై, ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. ఇవన్నీ పార్టీ అనుమతి లేకుండానే చేశారని బీజేపీ భావిస్తోంది. దీంతో ఆయన్ను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటివల సోము వీర్రాజు ఓ చానెల్ లో మాట్లాడుతూ.. ‘ఈ కర్లు, గిర్లు ఎవరి కోసం మాట్లాడుతున్నారో మాకు తెలుసు. వారి పని పడతాం’ అంటూ చేసిన వ్యాఖ్యల్లో దినకర్ ఉన్నట్టేనని అర్దమవుతోంది. పై ఉదాహరణలతో దినకర్ పై వేటు వేసేందుకు కేంద్ర నాయకత్వాన్ని సోము వీర్రాజు కోరినట్టు తెలుస్తోంది. నేడోరేపో ఉత్తర్వులు రావచ్చని తెలుస్తోంది.
ఇంకా కొన్ని పేర్లున్నాయి.. త్వరలోనే జాబితా..
ఓవీ రమణ(ఆంధ్రజ్యోతిలో అమరావతికి అనుకూలంగా వ్యాసం రాశారు), వెలగపూడి రామకృష్ణ (అమరావతి ఉద్యమంలో పాల్గొని చెప్పుతో కొట్టుకున్నారు).. లంకా దినకర్. (అమరావతికి అనుకూలంగా కోర్టులో పిటిషన్ వేశారు). ఇలా.. పార్టీ వ్యతిరేకులను ఏరివేయటం కోసం రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో మరో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కొందరు పెద్దలు ఉండటంతో బీజేపీ పెద్దలు కాస్త ఆలోచిస్తున్నారని సమచారం. అయితే.. సునీల్ దేవదర్, జీవీఎల్ నరసింహారావులతో కలిసి సోము వీర్రాజు.. టీడీపీ కోసం పని చేసేవారు ఎవరు.. బీజేపీ కోసం పనిచేసే వారు ఎవరు అనే లిస్టు ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.