భారత దేశంలో కోట్లాది మంది హిందువుల కల ఈ నెల 5వ తేదీ నెరవేరబోతున్నది. శ్రీ రాముడి జన్మస్థలంగా భావిసున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5వ తేదీన భూమి పూజ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ఇష్యు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి ఎలా ఉపయోగపడింది? దీనికి కారకులు ఎవరు? ఉత్తర భారత దేశంలో బీజేపీ ఎదగడానికి అయోధ్య రామ మందిర సెంటిమెంట్ ఎలా ఉపయోగ పడింది అనే విషయాలపై ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తున్న కధనం.
శ్రీరాముడు జన్మభూమిగా భావించే అయోధ్య క్షేత్రంలో 1528లో బాబ్రీ మసీదు నిర్మించారని హిందూ సంస్థల ఆరోపణ. 1853లో మొదటి సారిగా అయోధ్యలో మత విద్వేషాలతో ఘర్షణలు జరిగాయి. 1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు, ప్రార్ధనలు చేసుకొనేందుకు ముస్లింలకు వేరు వేరుగా అనుమతులు కల్పించారు. 1949లో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో మళ్ళీ వివాదం రాజుకుంది. దీనితో ప్రభుత్వం అది వివాదాస్పద భూమిగా ప్రకటించింది.
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలంటూ 1984లో పలు హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. 1986లో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వగా, బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం తెలిపింది. 1989లో విశ్వహిందూ పరిషత్ (వీ హెచ్ పీ) బాబ్రీ మసీదు వద్ద రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసింది.1990లో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఎల్ కె అద్వానీ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్ చేస్తూ రథయాత్ర చేపట్టారు.
1990 సెప్టెంబర్ 25న బీహార్ లోని సోమనాథ్ ఆలయం నుండి అద్వానీ చేపట్టిన రామ్ రథయాత్ర కు హిందూ భక్తుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రామ్ రథయాత్ర ను అద్వానీ రామ మందిరం నిర్మాణం కోసం చేపట్టినా అది బీజేపీ బలోపేతం అయ్యేందుకు ఎంతగానో ఉపయోగ పడింది. అద్వానీ నేతృత్వంలో వీ హెచ్ పీ నేత అశోక్ సింఘాల్, ఉమా భారతి, ఆర్ ఎస్ ఎస్ నేత గోవిందా చార్య, తదితరులు చేపట్టిన రధయాత్ర కారణం గా రాజుకున్న సెంటిమెంట్ తో ఉత్తర భారత దేశంలో బీజేపీ బలోపేతం అవ్వడం వల్లనే పార్లమెంట్ లో రెండు స్థానాల నుండి 182 స్థానాలకు ఎదిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదని పరిశీలకులు అంటుంటారు.
రామ్ రధయాత్ర పది వేల కిలోమీటర్లు సాగి అయోధ్య లో ముగియాల్సి ఉండగా అక్టోబర్ 23న బీహార్ లోని సమస్తి పూర్ లో లాలూ ప్రసాద్ సర్కార్ అడ్డుకొని అరెస్ట్ చేసింది. నాడు అద్వానీ అరెస్ట్ తో ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు, పలు ప్రదేశాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కోవడంతో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. అదే నెల 30వ తేదీన వేలాది మంది కరసేవకులు అయోధ్య కు బయలు దేరగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ వెయ్యి మంది కరసేవకులు అయోధ్య కు చేరుకున్నారు. నాడు బాబ్రీ మసీదు లోకి కరసేవకులు చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నం చేయగా పోలీస్ లు కాల్పులు జరపడంతో 28 మంది మృతి చెందారు.
1992లో పీవీ నర్సింహా రావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో వీ హెచ్ పీ, బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య లో కరసేవకుల ర్యాలీ జరిగింది. డిసెంబర్ 6న జరిగిన ఈ ర్యాలీ లో దాదాపు లక్షా 50 వేల మంది వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్న సందర్భంలో హింసాత్మకంగా మారింది. కరసేవకులు మసీదును కూల్చి వేశారు. ఈ కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం దేశంలో మత ఘర్షణలు జరిగాయి. 2010లో అయోధ్యలో వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలని అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2011లో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీం కోర్టులో వాదోప వాదాలు అయిన తరువాత 2017లో అయోధ్య భూవివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చింది. అది సాధ్యం కాకపోవడంతో 2019 మార్చి నెలలో సుప్రీం కోర్టు మధ్యవర్తుల కమిటీని నియమించింది. ఆగస్టు వరకు మధ్యవర్తుల కమిటీ కూడా వివాదాన్ని పరిష్కరించలేకపోవంతో సుప్రీం కోర్టు అదే నెలలో రోజు వారి విచారణ ద్వారా ఇరు వర్గాల వాదనలు విన్నది. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది.