చెన్నై, జనవరి 13: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడులోని ఎస్టేట్ బంగ్లా దోపిడి వీడియో డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. జయలలిత ఎస్టేట్ బంగ్లాలో దోపిడీ, హత్యల గురించి తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ శామ్యూల్ ఢిల్లీలో ఈ వీడియోను విడుదల చేశారు. తమిళనాట ఈ వీడియో రాజకీయ దుమారానికి కారణమైంది.
ఈ డాక్యుమెంటరీలోని అంశాలు అవాస్తవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారనీ, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. జయలలిత కీలక పత్రాలను బంగ్లాలో ఉంచారని చెప్పడం సత్యదూరమని ఆయన తెలిపారు. తనపై కేసు పెట్టించాలని డిఎంకె నేత స్టాలిన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు.
బంగ్లా దోపిడీపై వీడియోలో అసత్యాలు ప్రసారం చేశారంటూ అన్నాడీఎంకే ఐటి విభాగం రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు రాజన్ సత్య చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎడప్పాడి తక్షణం పదవి నుండి వైదొలగాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కోరారు. అమ్మ మరణానంతరం ఎస్టేట్లో ఉంచిన నగదు, పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం హత్యలు చేసిందంటూ, తన ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలని ఆయన అన్నారు.
https://www.youtube.com/watch?v=42TC9WEj9bk&feature=youtu.be