కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో వైసిపి నేత పార్థసారథి ఆ కార్యక్రమం వద్దకు వచ్చేందుకు యత్నించారు. ఆయనని టిడిపి కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…గురువారం ఉయ్యూరులో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పార్థసారథిల మధ్య పరస్పరం మాటల యుద్దం నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నసంగతి తెలిసిందే. దీంతో ఈ సభలో టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వైసిపి నేత పార్థసారథి పెదఓగిరాలలోని జన్మభూమి కార్యక్రమం వద్దకు కూడా వస్తున్నట్లు తెలియడంతో ఇక్కడ కూడా ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అప్రమప్తమయ్యారు.
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పెదఓగిరాల గ్రామానికి చేరుకునేందుకు గాను జాతీయ రహదారి గుండా ప్రయాణించాల్సి ఉండగా…అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెదఓగిరాల జన్మభూమి కార్యక్రమం లో పాల్గొనేందుకు బయలుదేరి వచ్చిన వైసిపి నేత పార్థసారథిని జాతీయ రహదారిపైనే పోలీసులు అడ్డుకున్నారు.
అయితే మరోవైపు జన్మభూమి కార్యక్రమం నుంచి వెళ్లిపోయే క్రమంలో టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అదే సమయంలో అక్కడకు రావడంతో వైసిపి కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు, వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు వెంటనే స్పందించి ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.