ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో పార్లమెంటరీ నియోజకవర్గాల ను ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తే పరిపాలనా సులభతరం అవుతుంది. ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
అయితే జిల్లాల విభజన ప్రకటన రాకమునుపే అటు ప్రతిపక్షం నుండి ఇటు అధికార పక్షం నుండి ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదననే పలువురు తప్పుబడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అధికార పార్టీ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టిడిపి నుండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు గతంలో పలు సమస్యలను ఎత్తి చూపారు.
శ్రీకాకుళం జిల్లాను అసలువిభజించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇదే విషయాన్ని ధర్మాన ప్రసాదరావు కూడా పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు జిల్లాలు విస్తీర్ణ పరంగా చిన్న జిల్లాలు, వీటిని విభజిస్తే సాంకేతికంగా జిల్లా కేంద్రం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
అరకు పార్లమెంట్ ను తీసుకుంటే ఈ పార్లమెంటు పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం మెదలు కొని విజయనగరం, శ్రీకాకుళం,, తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 20 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఉంది. దాన్ని జిల్లాగా మారిస్తే ప్రజలు జిల్లాకేంద్రానికి వెళ్లాలంటే 250 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రకాశం జిల్లా, అనంతపురం, నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ సరిహద్దులు మారిపోతాయని టిడిపి నేత సోమిరెడ్డి గుర్తు చేస్తున్నారు. అయితే ఈ నాయకులు చెప్పిన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారో, లేదో తెలియదు గానీ సిఏం జగన్మోహన రెడ్డి మూడు నెలల డెడ్ లైన్ విధిస్తూ ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీలో సిసిఎల్ఎ కమిషనర్, జిఎడి కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సిఎంఒ అధికారి ఒకరు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో భాగంగా ప్రభుత్వం తాజాగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కమిటీకి ఉప సంఘాలు, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ అంశాలపై నాలుగు ఉప సంఘాలను ఏర్పాటు చేసింది.
జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతల నిర్వహణకు మొదటి సబ్ కమిటి, సిబ్బంది పునర్విభజన అధ్యయనం కోసం రెండవ సబ్ కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం కోసం మూడవ సబ్ కమిటీ, సాంకేతిక సంబంధిత అంశాల అధ్యయనం కోసం నాల్గవ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా పది మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించే క్రమంలో భాగంగా ఈ కమిటీ మూడు నెలల్లో ప్రభుత్వానికి అధ్యయన రిపోర్టు సమర్పించనున్నది.