(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన సంచలన ప్రకటనపై సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్ల ఇచ్చిందని గుర్తు చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోదని హెచ్చరించారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హైకోర్టు ఒక చోట, రాజధాని మరోచోట ఉంటే పెద్ద ఇబ్బందులేమీ ఉండవని అభిప్రాయపడ్డారు. ఒక చోట హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. రాజధాని నిర్మాణంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు జాప్యం చేశారని, దాన్ని అవకాశంగా తీసుకుని ప్రస్తుత సీఎం జగన్ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని… కానీ, పరిపాలన కేంద్రం మాత్రం ఒకటే ఉండాలని అన్నారు. అప్పుడే అధికార యంత్రాంగానికి, ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు.
రాజధాని రైతులు కంగారు పడవద్దు. అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తే కేంద్రం చూస్తూ వూరుకోదు. @BJP4Andhra
— YS Chowdary (@yschowdary) December 19, 2019