Sunil Deodhar: సునీల్ దియోధర్ Sunil Deodhar బీజేపీ నాయకులు తమ దూకుడు పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే వారి ఉద్దేశాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. అందుకు వారు వేస్తున్న అడుగులు వారికే చేటు కలిగించేవిగా ఉన్నాయని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కించడం అంటే.. భిన్నమైన ప్రచారం, ఓటర్లను ఆకట్టుకోవడం, తమ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పోరాటం.. ఇలా ముందుకెళ్లాలి. కానీ.. బెదిరింపు రాజకీయాలకు తెరలేవడమే ఇప్పుడు కాస్తంత విడ్డూరంగా ఉంది. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అటు నాగార్జున సాగర్, ఇటు తిరుపతిలో ఉప ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు ఇద్దరు సీఎంలను టార్గెట్ చేశారు. ఇటివల తిరుపతిలో సునీల్ ధియోధర్ మాట్లాడుతూ.. ‘త్వరలో జగన్ బెయిల్ రద్దవుతుంది’ అని.. ఆమధ్య బండి సంజయ్ కుమార్.. ‘త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్తారు’ అంటూ కామెంట్లు చేశారు. ఇలా వీరిద్దరూ ఇద్దరు సీఎంలపై చేసిన కామెంట్లు ప్రజలను ఆకట్టుకోవడం అటుంచితే సీఎంలకే కలిసొస్తాయని గతంలో నిరుపణైంది. ఇదంతా పక్కనపెడితే అసలు కోర్టు పరిధిలోని అంశాలను బీజేపీ నాయకులు ఎలా ప్రస్తావిస్తారనేది ఇక్కడ ఎవరికైనా వచ్చే సందేహం. ముఖ్యంగా జగన్ విషయంలో సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కే లాభం చూకూర్చేలా ఉన్నాయి.
గతంలో జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు ప్రవర్తించిన తీరు జనాల్లోకి వెళ్లబట్టే వైసీపీ భారీ స్థాయిలో విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముఖ్య నాయకుడే మళ్లీ జగన్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో ఊహించలేరా? అనేది ప్రశ్న. నిజంగానే రేపు కోర్టు జగన్ బెయిల్ రద్దు చేసినా.. ఇదంతా బీజేపీ చేయిస్తోందా? అని కోర్టులపైనే అనుమానం వచ్చేలా చేసే ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేయడం అర్ధరహితం. కోర్టులను ప్రశ్నించడం ఎంత తప్పో.. కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాజకీయ నాయకులే వ్యాఖ్యలు చేయడం కూడా అంతే తప్పు. మరి.. బీజేపీ నాయకులు దీనిపై ఎలా అంతర్మధనం చేసుకుంటారో..?