హైదరాబాదు, జనవరి 18: రక్షణ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 23నుండి 25వ తేదీ వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు చేపట్టిన సమ్మెకు సిపిఐ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో పలు విషయాల గురించి మాట్లాడారు. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు అనుమతించడం వల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
మోదీ కక్ష పూరితంగానే ఆలోక్వర్మను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. అలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కేరళలో కమ్యూనిస్టులపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని సురవరం అన్నారు.
జెఎన్యు విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్ను వెనక్కు తీసుకోవాలని సురవరం డిమాండ్ చేశారు.