ఏపీలో, మునుపటి కంటే ఇప్పుడు పసందుగా రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయా పార్టీల నేతల ఎత్తుగడలను ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడూ ఓ రేంజ్లో కనిపెడుతూనే ఉంటుంటారు.
అలా కనిపెడుతున్న తరుణంలో తాజాగా బుక్కయింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన పని వైసీపీకి ఓ రేంజ్లో అటాక్ చేసే చాన్స్ ఇచ్చింది.
మంత్రిగారి ఫైర్….
ఏపీ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదంటే, చెప్పటానికి ఇష్టపడటం లేదంటే ఆయన మనస్తత్వం ఏమిటో, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. “భాషా ప్రయుక్త రాష్ట్రంగా, తెలుగువారంతా ఒక్కటిగా సువిశాల ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగి 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జూన్ 8న నవ నిర్మాణ దీక్ష, అవతరణ అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టాడు తప్పితే, రాష్ట్ర అవతరం దినోత్సవం జరపలేదు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తించలేని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, పార్టీ పేరులో తెలుగు ఉన్నా తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కూడా గౌరవించలేని ఆ పార్టీకి, చంద్రబాబుకు తెలుగువారు మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.“ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తండ్రి గణిత మేధావి… కొడుకు బాల మేధావి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్పై సైతం మంత్రి కన్నబాబు ఫైరయ్యారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో గొప్పగా సంక్షేమ పథకాలు అమలవుతుంటే.. తండ్రి గణిత మేధావి.. కొడుకు బాల మేధావిలా చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. “వరి చేను.. చేపల చెరువుకు కూడా లోకేష్ కు తేడా తెలియదు. వరదల్లో పర్యటన అంటాడు, ట్రాక్టర్ల మీద తిరుగుతాడు. వరదకు.. వర్షానికి తేడా తెలియదు. సీఎం జగన్ను విమర్శించే స్థాయి లోకేష్కు ఉందా..? ఇన్ పుట్ సబ్సిడీ గురించి టీడీపీ మాట్లాడితే.. మిగతా నాలుగువేళ్ళు వాళ్ళ వైపే ప్రజలు చూపిస్తున్నారు. ఎప్పుడైనా, ఏ సంవత్సరం ఇన్ పుట్ సబ్సిడీ ఆ సంవత్సరం ఇచ్చారా..? ఒక ఏడాది రెండేళ్ళకో, మూడేళ్ళకో ఇచ్చారు, నేడు సీఎం జగన్ ఏ సీజన్లో ఇన్ పుట్ సబ్సిడీ ఆ సీజన్ లోనే ఇస్తున్నారు.“ అంటూ అటాక్ చేశారు
లోకేష్ను జనం మీదకు వదిలేశారు
లోకేష్ కు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జనం మీదకు వదిలినట్టు ఉన్నారు అని కన్నబాబు కామెంట్ చేశారు. “ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకుని లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు. పెద్ద డైలాగులు మాట్లాడితే.. మీడియా అటెన్షన్ వస్తుంది అని అనుకుంటున్నట్టు ఉన్నాడు. కొల్లేరుకు ఇప్పుడెళ్ళినా నీళ్ళు కనిపిస్తాయి. తండ్రీకొడుకుల ఈ నటనలు రుచించకపోబట్టే ఆ పార్టీని 2019లో 23 స్థానాలకు పరిమితం చేశారు, అమరావతిలో ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. రకరకాల కుట్రలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని, రాష్ట్రం అంతా వాళ్ళ కోసమే ఎదురు చూస్తుందన్నట్టుగా చంద్రబాబు, లోకేష్లు కలలు కంటున్నారు.“ అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు.