తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బోయిన్పల్లి కిడ్నాప్ అంశంలో అనేక మలుపులు తెరమీదకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా తెలుగుదేశం పార్టీ నేత ,ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విచారణ ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.
మూడో రోజు అఖిలప్రియ కస్టడీ ముగిసింది. ఈ మూడ్రోజుల కస్టడీలో పోలీసులు పలు విషయాలు రాబట్టినట్టు చెబుతున్నారు. 300కి పైగా ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టినట్టు సమాచారం .ఈ సమాధానాల్లో అనేకం సంచలన విషయాలే ఉన్నట్లు సమాచారం.
భలే స్కెచ్చేసిన భార్గవ్ రామ్ … అఖిలప్రియ
మాజీ మంత్రి అఖిలప్రియ , ఆమె భర్త అఖిలప్రియ కలిసే చేసినట్లు సమాచారం. కిడ్నాప్ ప్లాన్ వివరాలన్నీ పోలీసులకు అఖిల పూసగుచ్చినట్టు చెప్పిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సమాచారం ప్రకారం ఎంజీఎం స్కూల్లో కిడ్నాపర్లతో భార్గవ్, చంద్రహాస్ లు భేటీ అయ్యారు. కూకట్ పల్లిలోని హోటల్లో మాడాల శ్రీనుతో భార్గవ్ భేటీ అయినట్టు చెబుతున్నారు. స్కూల్ లో సినిమా చూపెట్టి కిడ్నాప్ కు భార్గవ్ స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ సమయంలో బోయినపల్లి వరకూ కారులోనే వెళ్లిన భార్గవ్ లోపలి మాత్రం వెళ్ళలేదు. అలానే కిడ్నాప్ తర్వాత మొయినాబాద్ ఫామ్హౌస్ చేరుకున్న భార్గవ్ సంజయ్, ప్రవీణ్లతో సంతకాలు చేయించినట్టు గుర్తించారు. కిడ్నాప్ తర్వాత పోలీసుల వేటతో ప్లాన్ మార్చిన అఖిలప్రియ, కిడ్నాప్ చేసిన వారిని వెంటనే వదిలేయాలంటూ ఆదేశించినట్టు గుర్తించారు. అఖిల ఆదేశాలతోనే ముగ్గురినీ కిడ్నాపర్లు వదిలి పారిపోయినట్టు చెబుతున్నారు.
వాళ్లు దొరికితే చాప్టర్ క్లోజ్
కిడ్నాప్ సమయంలో లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. భార్గవ్రామ్, జగత్ విఖ్యాత్ ఇద్దరూ స్పాట్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, జగత్ విఖ్యాత్ను కేసులో నిందితుడిగా చేర్చనున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్ జరిగిన తర్వాత ఒకే వాహనంలో భార్గవ్, జగత్ విఖ్యాత్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు . కిడ్నాప్ కేసులో మొత్తం 15 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రహాస్, భార్గవ్, మాడాల శ్రీను దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అటున్నారు.