హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ నష్ట పరిహారం విషయంలో పలువురు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసించారు. అయితే, ఈ సహాయం పెద్ద ఎత్తున దారి మళ్లిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలే నిదర్శనం.
హైదరాబాద్లో ఆందోళనలు
వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం అందడం లేదని హైదరాబాద్లోని పలు చోట్ల ఆందోళనలు జరిగాయి.
ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే డబ్బులు ఇస్తున్నారని, అసలైన బాధితులకు సాయం అందడం లేదని వాపోయారు. భారీగా అక్కడికి చేరుకున్న బాధితులు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త హనుమంతరెడ్డి బాధితులకు మద్దతు తెలిపారు. వరద సహాయం అందించడంలోనూ వివక్ష చూపుతున్నారని బాధితులు మండిపడ్డారు. నాచారం-మల్లాపూర్ రహదారిపై నిరసనకు దిగారు.
డిప్యూటీ స్పీకర్ నివాసంలో…
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కార్యాలయాన్ని స్థానిక ప్రజలు ముట్టడించిన ఉదంతం సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్లోని అడ్డగుట్ట, మెట్టుగూడా, బౌద్ధ నగర్, సీతాఫల్ మండి తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేపట్టారు. అసలైన అర్హులకు సహాయం చేయకుండా కేవలం టీఆరెస్ నేతల కుటుంబాలకు, కార్యకర్తలకు పంచుకున్నారని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించాలని అసలైన బాధితులను గుర్తించి వారికి అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. జిహెచ్ఎంసి, డిప్యూటీ స్పీకర్, కార్పొరేటర్ల ఇళ్లను టీఆరెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తున్న ప్రజలు ఉదంతం చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేసి మరి సమస్యల పాలైందని పలువురు అంటున్నారు.