T Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై పలువురు సీనియర్ నేతలు మొదటి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందే ఒక సారి మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు నేడు అశోకా హోటల్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పంజాబ్ లో సిద్ధూను పీసీసీ అధ్యక్షుడుగా చేసిన తరువాత ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఇక్కడి టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ కు పీసీసీ బాధ్యతల నుండి తొలగించి పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి పీసీసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పై ముందుగా సమావేశమై త్వరలో ఢిల్లీకి వెళ్లి సోనియా గాందీ, రాహుల్ గాంధీకి తమ నిర్ణయం చెప్పాలని సీనియర్ లు భావిస్తున్నారు.
T Congress: వీ హనుమంతరావు నాయకత్వంలో..
ఇదే క్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. పలువురు సీనియర్ నేతలు గ్రూపుగా సమావేశం అవుతున్న విషయం తెలిసిన పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ గాంధీలతో చెప్పాలే కానీ ఇలా సమావేశాలను పెట్టి పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. పార్టీ అధిష్టానం నుండి సీనియర్ నేతలకు ఫోన్ లు రావడంతో సమావేశంపై అనిశ్చితి నెలకొంది. సమావేశం జరపతలపెట్టిన అశోకా హోటల్ వద్దకు సీనియర్ నేతలు వీ హనుమంతరావు, జగ్గారెడ్డి లు మాత్రమే చేరుకున్నారు. ఆ తరువాత మర్రి శశిధర్ రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు నాయకులతో సమావేశం అయ్యారు.
రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు అంటూ…
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియా మాట్లాడుతూ తమపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అజెండా ఫాలో కాకుండా ఆయన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారని అందుకే తాము మీడియా ముందుకు వచ్చామన్నారు. పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదన్నారు. పార్టీలో సమన్వయం కొరవడిందని జగ్గారెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినప్పటికీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటున్నారనే భావనలో ఉన్నారు. సీనియర్ నేతలను గౌరవించడం లేదంటూ ఆయన నాయకత్వంలో పని చేయడానికి సముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలువురు సీనియర్ నేతల సూచనల నేపథ్యంలో రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా బీజేపీకి వైపుకు చూస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?