Tamilnadu : తమిళనాడు Tamilnadu ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో ఎన్నికలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జాతీయ ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్నయుద్ధం అయితే..తమిళనాడులో ద్రవిడ పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్యం అని చెప్పాలి. బెంగాల్ రాజకీయం ఇప్పుడు మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రతి ఎన్నికల సందర్భమూ జాతీయ దృష్టిని ఆకర్షిస్తాయి. వంతుల వారీగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు మాత్రమే అధికారం కట్టబెడతారు తమిళ ఓటర్లు. 2016లో మాత్రమే అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు జరిగాయి.
‘మాలో మేము కొట్టుకుంటాం కానీ.. బయటి వాళ్లు మా మధ్యకు వస్తే మేమంతా ఒకటే’ అనే టైపు తమిళ ఓటర్లు. అన్నాడీఎంకేలో ఆడించాలని భావించిన బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 234 సీట్లకు కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చింది అన్నాడీఎంకే.
ఇక డీఎంకేతో ఉన్న స్నేహం దృష్ట్యా ఎక్కువ ఆశించిన కాంగ్రెస్ కు 25 సీట్లు మాత్రే ఇచ్చింది. ఈమాత్రం సీట్లతో జాతీయపార్టీలు తమిళనాడులో సాధించేది ఏమీ లేదు. భాష, ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రతిసారీ చేయని ప్రయత్నం ఉండదు. ఇటివల రాహుల్ గాంధీ పర్యటనే ఇందుకు నిదర్శనం. అమిత్ షా కూడా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టినా పరిస్థితులు అనుకూలించేలా లేవు.
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేను చేతుల్లోకి తీసుకుందామని భావించిన శశికళను పార్టీనే బహిష్కరించగా.. కేసుల బూచీ చేపించి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకునేలా చేసింది బీజేపీ. తమిళనాడులో చక్రం తిప్పాలని.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూసింది బీజేపీ. కానీ.. బీజేపీ పాచిక పారినట్టు కనబడటం లేదు. మరోవైపు డీఎంకేతో ఎప్పటినుంచో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఆశలపై కూడా డీఎంకే నీళ్లు చల్లుతోంది.
తమిళనాడులో అడుగు పెట్టాలనే జాతీయపార్టీలకు తమిళ ఓటర్లు ఎప్పుడూ అవకాశమివ్వరు. ప్రస్తుత ద్రవిడ పార్టీల తీరు కూడా అంతే..! సీట్ల సర్దుబాటులో ఇంతే ఇస్తాం.. ఆపై మీ ఇష్టం అనే తరహాలో ఉంది. అందుకే ద్రవిడ పార్టీలకు.. తమిళులకు ఎదురెళ్లడం జాతీయపార్టీల వల్ల కాని పని. ఎప్పటిలా ఇప్పుడూ తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తూండటమే బీజేపీ, కాంగ్రెస్ పని..!