అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లపై మంత్రి కొడాలి నాని పరుష పదజాలంతో దూషించడం వల్లనే తాను ఆయనపై దుర్బాషలాడినట్లు యలమంచిలి పద్మ అన్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న అభియోగంపై పద్మను కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. విషయం తెలుసుకున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టిడిపి నాయకులతో కలిసి కంచికచర్ల పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విడుదల అనంతరం పద్మను ఆమె స్వగ్రామమైన గుంటూరు జిల్లా యర్రబాలెం గ్రామానికి తంగిరాల సౌమ్య తీసుకెళ్లారు.
చంద్రబాబును మంత్రి కొడాలి నాని తిట్టకుండా ఉంటే తాము ఆయనను విమర్శించమని ఈ సందర్భంగా పద్మ అన్నారు.అరెస్టులకు భయపడేది లేదన్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఏమి చర్యలు తీసుకోలేదన్నారు.
గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మంత్రి కొడాలి నానికి తీవ్ర హెచ్చరికలు చేసింది. పద్మ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో వైసిపి కార్యకర్త ఒకరు కంచికచర్లలో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పద్మపై సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చారు. నేడు పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.