(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ప్రతిపక్షాలకు ఆస్త్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం తగులబడిన సంఘటన మరువక ముందే విజయవాడ ప్రాంతంలో మరో ఘటనలు చోటుచేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రథంకు ఉన్న మూడు వెండి సింహాలు మాయం కావడం, అది వెలుగు చూసిన రోజు రాత్రే విజయవాడ రూరల్ మండలం నిడమానురులోని సాయి మందిర ఆవరణలోని సాయిబాబా విగ్రహాం ధ్వంసం ఘటన జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనలపై బిజెపి, హింధూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. మరో పక్క ఘటనలపై ప్రతిపక్ష, ఆధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కులాలు, మతాలను అడ్డం పెట్టుకోని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించగా ఆలయాలపై జరిగిన దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
చంద్రబాబు ఏమన్నారంటే….
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలపై దాడులకు సంబంధించి 80 ఘటనలు జరిగాయనీ, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవాలని చూడటం దుర్మార్ఘమనీ అన్నారు. రాష్ట్రంలో వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం ఏమిచేస్తున్నారనీ ప్రశ్నించారు. మత సామరస్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం సరైన విధంగా స్పందించి ఉంటే ఇలాంటివి పునరావృత్తం అయ్యేవి కావు, ఇప్పుడు ఆలయాలపై దాడులు చేసిన వాళ్లు రేపు మసీదులపై, చర్చిలపైనా దాడులు చేస్తారని అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే…
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సున్నితమైన అంశాలలో వివాదాన్ని రేపి విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రామాల్లో జరిగిన ఘటనలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ఎజండాగా పెట్టుకున్నారని విమర్శించారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఇవ్వడం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.