అమరావతి: రాష్ట్రంలో వైసిపి పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తూ అర్హులకు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
అసమర్థ పాలనతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ గత ప్రభుత్వ తప్పదం అంటూ తమపై నిందలు మోపుతున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం అయిదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అంటూ ప్రచారం చేసి అయిదు నెలల నుండి వెతుకుతూ కూడా ఏమీ నిరూపించలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఆదాయం లేదు. సంపద సృష్టిపై ఈ ప్రభుత్వానికి ఆలోచన కుడా లేదని చంద్రబాబు విమర్శించారు. ఖర్చు ఇష్టానుసారం చేస్తూ పోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంపదను కాపాడుకోలేకపోవడం వల్లే రాష్టం అధోగతి పాలయ్యిందని చంద్రబాబు అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలను ఇంత వరకూ చెల్లించకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. వైసిపి ప్రభుత్వం ఏమి చేసినా రాయడానికి వీలులేదంటూ మీడియాను సైతం బెదిరిస్తున్నారనీ, ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు.