పికే అలియాస్ ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి, జగన్ కి నీడగా ఉంటూ ఆ పార్టీని అందలం ఎక్కించిన సంగతి తెలిసిందే. వైసీపీ గెలుపులో జగన్ చరిష్మా, పార్టీ కార్యకర్తల కష్టం ఎంతగా ఉందో తెరవెనుక పి కే వ్యూహరచన కూడా అంతే స్థాయిలో ఉంది. జగన్ పాదయాత్రకు ముందు నుంచి జగన్ సీఎం అయ్యే వరకు రోజు రోజుకి కొత్త వ్యూహాలు వేస్తూ ఏ రోజు ఏం చేయాలో ముందుగానే నిర్ణయం తీసుకుంటూ పక్కాగా అమలు చేశారు. నిజానికి 2019 ఎన్నికల వరకు పీకే పేరు ఉత్తర భారతానికే పరిమితమయ్యేది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాజకీయాలకే పరిమితం అయ్యేది. కానీ 2019లో జగన్ గెలుపు తర్వాత పికే పేరు దక్షిణ భారతాన్ని కూడా వ్యాపించింది. అతనితో పొలిటికల్ కాంట్రాక్టుల కోసం చాలా పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తో కాంట్రాక్ట్ కుదిరి అక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలుపునకు కృషి చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కి పీకే పని చేస్తున్నారు.
చంద్రబాబు తో త్వరలో మంతనాలు
ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు కీలక నాయకులు పార్టీలు వీడుతూ చంద్రబాబు మనో స్టైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా కొంత మేరకు నైరాశ్యంలో ఉన్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీని గాడిన పెట్టాలంటే తెరవెనుక వ్యూహాలు చాలా అవసరం. నిజానికి చంద్రబాబు ఓ పెద్ద రాజకీయ వ్యూహకర్త. ప్రతి ఎన్నికలకు ముందు ఆయన వ్యూహాలు వేసుకుంటూ ఆయన అమలు చేసుకుంటూ వెళుతుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు తెలివితేటలు పాత వై పోవడం, ఆయన తరహా రాజకీయం జనాలకు బోర్ కొట్టడం, నాయకులు కూడా కొత్త వ్యూహాలు అవసరం పడడంతో చంద్రబాబు పీకే తో డీల్ కుదుర్చుకొనే వ్యూహం లో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికీ టీడీపీకి పి కే కి అత్యంత సన్నిహితుడైన రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ పి కే స్నేహితుడు. అయన టీమ్ లో రెండవ స్థాయి వ్యక్తి. ఈయన టీడీపీకి ఆరు నెలల నుంచి పనిచేస్తున్నారు.రాబిన్ శర్మతో పాటు పి కే ను కూడా టిడిపిని గద్దె నెక్కించే కాంట్రాక్ట్ అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ మేరకు త్వరలోనే పి కే ను కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మే నెల నాటికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాత ఆరు నెలలు విశ్రాంతి అనంతరం 2022 నాటికి పి కే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కాంట్రాక్టు మేరకు వస్తారని పార్టీ లో అంతర్గత సమాచారం.
మరి జగన్ ఏం చేస్తారు?
2019 ఎన్నికల్లో గెలుపు తర్వాత జగన్ కి, పీకే కి సన్నిహిత సంబంధాలు బాగానే నడిచాయి. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ ల వ్యవస్థ మీద అధ్యయనం కోసం పీకే కి బాధ్యతలు అప్పగించాలని సీ ఎం జగన్మోహన్ రెడ్డి భావించారట. కానీ ఆ సందర్భంలో పీకే టీమ్ లోని కొందరు సభ్యులు నేరుగా సీఎం జగన్ ను కలిసి ఆ కాంట్రాక్టు తక్కువ ధరకు తమకు అప్పగించాలని అడగడంతో సీఎం అంగీకరించారుట. దీంతో పీకే తనకు రావాల్సిన కాంట్రాక్టు వేరే వాళ్లకు ఇవ్వడం వల్ల నొచ్చుకున్నారట. పెద్ద మొత్తంలోనగదు వ్యవహారం కావడంతో పీకే జగన్ కి, వైసీపీ కి దూరంగా జరిగారని టాక్ వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు పీకే టీమ్ లోని కీలక సభ్యులందరూ వైసిపికి అనుకూలంగా, వైసిపి నాయకులు వద్ద, జగన్ వద్ద ఉండగా, పీకే మాత్రం మరో టీంతో ఆంధ్రప్రదశ్ లో టిడిపికి పని చేయనున్నారని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ చంద్రబాబు తో పాటు పీకే వర్సెస్ పీకే టీమ్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.