(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చునే కంటే దూరంగా ఉండటమే ఉత్తమం అని ఇటీవల పేర్కొన్న అనంతపురం సీనియర్ నేత, మాజీ మంత్రి జేసి దివాకరరెడ్డి ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధించాలన్న నూతన చట్టాన్ని జగన్ సర్కార్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో తన నియోజకవర్గంలో ఎన్నికలకు దూరంగా ఉంటామని జేసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేయడం ఏమిటని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయన వర్గీయులు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో జేసీ భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. డబ్బు, మద్యం పంపిణీలకు దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించగా ఆ రెండూ లేకుండా ఎవరూ ఓటు వెయ్యరని దివాకర్రెడ్డి బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో చదువుకున్న వారిలో మార్పు వచ్చిందని కానీ, కాయకష్టం చేసుకునే వారిలో ఇంకా మార్పు రాలేదనీ, నవరత్నాలు వారికి నేరుగా అందుతున్నాయనీ.. ఆ ప్రభావం ఎన్నికలపై ఉంటుందనీ దివాకర్రెడ్డి చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.
చంద్రబాబుతో భేటీ అనంతరం జేసీ..తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను మీడియాతో పంచుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందనీ, అది పతాకస్థాయికి వెళ్లాలంటే ఇంకా సమయం పడుతుందనీ, అప్పటి వరకు కామ్ గా ఉండాల్సిందేనని జేసీ వ్యాఖ్యానించారు. 2024లో చంద్రబాబు సీఎం అవుతారని, కానీ ఆయన చెయ్యగలిగింది ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికి చంద్రబాబు చుట్టూ కోటరీ పనిచేస్తోందని, ఆయనకు నిజాలు తెలియనివ్వడం లేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యవద్దు అంటే తమ వాళ్లు కూడా వినడం లేదని అన్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారని, మధ్యలో తాను చేయగలిగింది ఏముందని జేసీ అన్నారు.